జగన్ కూ మోడీ సర్కారుకూ ఏమాత్రం తేడా వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు వెయిట్ చేస్తున్నారు. కానీ జగన్, మోడీ సంబంధాలు మాత్రం బాగానే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ విషయం కృష్ణాపురం ఉల్లి రైతులపై నిషేధం ఎత్తి వేత విషయంలో రుజువైంది. వైసీపీ ఎంపీలు ఇలా వెళ్లి కేంద్రాన్ని అడిగారో లేదో.. ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే కేంద్రం కృష్ణాపురం ఉల్లిపై నిషేధం ఎత్తేసింది.
అసలు ఈ కృష్ణాపురం ఉల్లి కథేంటంటారా..? కృష్ణాపురం ఉల్లిపాయలు రాష్ట్రంలోని కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మాత్రమే రైతులు పండిస్తుంటారు. కేపీ ఉల్లిపాయలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉంటుంది. ఈ ఉల్లిపాయలను దేశీయంగా వంటకాల్లో ఉపయోగించరు. కేవలం విదేశాలకు ఎగుమతి చేసేందుకు మాత్రమే రైతులు వీటిని పండిస్తుంటారు.
అయితే.. ఇటీవల అసాధారణంగా పెరిగిన ఉల్లిధరల కారణంగా అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ప్రభావం ఏపీ రైతులపై పడింది. అందుకే.. కేపీ ఉల్లిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని సీఎం వైయస్ జగన్ కేంద్ర మంత్రికి లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు వైయస్ఆర్ సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం కేపీ ఉల్లిపాయల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.
కృష్ణాపురం ఉల్లి ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను కలిసి ఆయనపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చిన రెండు రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ రావడం విశేషం. పాపం.. జగన్, మోడీ సంబంధాలు ఈ రేంజ్ లో ఉండటం చూసి టీడీపీ వర్గాలు డంగైపోతున్నాయి.