కొంచెం కామెడీగా వున్నా, ఇది నిజమే.. పచ్చటి సంసారంలో బిర్యానీ చిచ్చు పెట్టింది. ఎన్నిసార్లు అడుగుతున్నా భర్త బిర్యానీ తీసుకురావడం లేదని అలిగిన సదరు మహిళ ఆవేశంతో ఆత్మహత్యకు యత్నించిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాలిలా వున్నాయి.. రెహమత్ నగర్‌లో నివసించే వెంకటయ్య ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. మూడు రోజులుగా అతని భార్య పద్మ (28) చికెన్‌ బిర్యానీ తీసుకురావాలని భర్తను కోరుతోంది. యధావిధిగా.. బుధవారం కూడా మరోసారి భర్తను కోరగా.. రాత్రి ఒట్టి చేతులతో ఇంటికి వచ్చాడు భర్త! 

 

ఇక ఈ విషయమై భర్త తన మాటకు విలువ ఇవ్వడం లేదని.. భావించిన పద్మ, అందరూ పడుకున్న సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుంది. చుట్టుపక్కలవారు గమనించి ‘108’ అంబులెన్స్ సాయంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె శరీరం 70శాతం కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. భర్త వెంటకయ్య ఫిర్యాదుతో పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

అయితే ఇలాంటి సంఘటనలు మనకి.. పైగా మన తెలుగు వాళ్ళకి కొత్తేమి కాదు, ఇటీవల వెలుగు చుసిన విషయాలెన్నో.. సాధారణంగా కొత్తగా వివాహమైనవారు ఏదో చిన్నచిన్న కారణాలతో గొడవలు పడుతుంటారు. చివరకు పెద్దలు కలుగజేసుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసి మళ్ళీ వారి కాపురాన్ని కలుపుతారు. కానీ ఇక్కడ జరిగిన సంఘటనలతో పెద్దలే కాదు, పోలీసులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఉదాహరణకు ఇలాంటిదే ఒకటి గతంలో జరిగింది...

 

యాదయ్యగౌడ్, అంజలికి నాలుగు నెలల క్రితం పెద్దలు వివాహం చేశారు. మూడు నెలల పాటు వీరి కాపురం బాగానే సాగింది. అయితే ఒక నెలరోజుల నుంచి మాత్రం వీరి కాపురంలో చిచ్చు పెట్టింది బిర్యానీ. భర్త రోజూ రాత్రి ఇంటికి వచ్చిందే భార్యను బిర్యానీ పెట్టమని అడిగేవాడు. రోజూ బిర్యానీ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. వారానికి ఒకసారి మాత్రమే చేస్తానని చెప్పింది భార్య అంజలి. దీంతో కోపంతో ఊగిపోయిన యాదయ్యగౌడ్ ఆమెను ఇంట్లో నుంచి పంపేశాడు. విషయం తెలిసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: