తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత,అనంతపురం రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఇటీవల కాలంలో వరుస పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గడిచిన కొన్ని రోజుల్లో జేసీకి చెందిన ట్రావెల్స్ను సీజ్ చేయడం తెలిసిందే. రవాణా శాఖ అధికారులు ఇటీవల జరిపిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని కొన్ని జేసీ ట్రావెల్స్ బస్సులు పట్టుబడ్డాయి. సరైన రికార్టులు లేకపోవడంతో అధికారులు ఈ బస్సులను సీజ్ చేశారు. ఇలా జెసి దివాకర్ రెడ్డి కి సంబంధించి జేసీ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులను నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించిన అధికారులు వరుసగా సీజ్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది.
దీంతో తన ట్రావెల్స్ కు చెందిన బస్సులను సీజ్ చేయడంపై గతంలో జేసీ మండిపడ్డారు. ఇక తాజాగా ఈయనకు మరో షాక్ తగిలింది. జేసీ దివాకర్రెడ్డి ట్రావెల్స్లో ఫోర్జరీ బాగోతం బయట పడింది. పలు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన జేసీ ట్రావెల్స్ ఉద్యోగులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సీఐలు, ఎస్సైలు, ఆర్టీఏ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే వీరి నుంచి ల్యాప్ టాప్, థంబ్ మిషన్, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు రామ్మూర్తి, ఇమాం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
అలాగే పోలీసు, రవాణాశాఖ అధికారుల సంతాకాలను జేసీ ట్రావెల్స్ ప్రతినిధులు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో 6 లారీలను జేసీ ట్రావెల్స్ కర్ణాటకలో విక్రయించారు. దీంతో మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. జేసీ ప్రభాకర్రెడ్డి సతీమణి ఉమాదేవి జేసీ ట్రావెల్స్ ఎండీగా ఉన్నారు. ట్రావెల్స్ యాజమాన్యం ఒత్తిడి మేరకే సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిందితులు పోలీసులు విచారణలో తెలిపారు.