ఉగ్రవాదులకు సాయం చేస్తూ పట్టుబడ్డ కశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. డీఎస్పీ దవీందర్ సింగ్ జమ్మూ కశ్మీర్ పోలీస్కు చెందిన యాంటీ-హైజాకింగ్ విభాగంలో పనిచేస్తుండగా, ప్రస్తుతం శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాదులతో పోరాటాలలో ఆయన పనితీరుకు ప్రశంసలు లభించడమే కాదు డీఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. అయితే, ఆయనపై ఆరోపణలు రావడంతో ఎస్ఓజీ నుంచి తొలగించి కొన్నాళ్లు విధుల నుంచి తప్పించారు. అతడిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసిన కశ్మీర్ పోలీసులు... ఉగ్ర సంబంధాలపై కూపీ లాగుతున్నారు.
ఈ క్రమంలోనే డీఎస్పీ దవీందర్ సింగ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కశ్మీర్లో జరిగిన దాడుల్లో లభ్యమైన ఆధారాలు, రికార్డులు, సీజ్ చేసిన మెటీరియల్ ద్వారా సింగ్ నిర్వాకాలు దిగ్భ్రాంతిగొలిపేలా బయటపడ్డాయి. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా డీఎస్పీ దవీందర్ సింగ్ ఎవరిమాటా వినే రకం కాదని, ఆయన ఏ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పనిచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించేవాడని తెలిసింది. నిత్యం మద్యం సేవించడంతో పాటు దాదాపు పన్నెండు మంది మహిళలతో ఆయనకు సంబంధాలున్నట్టు ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి.
మహిళలతో ఎఫైర్లు నడపటంపై సింగ్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని లైంగిక సంబంధాలకు బానిసగా మారిన ఆయన నిత్యం వయాగ్రాను వాడతారని కూడా ఓ ప్రైవేట్ టీవీ చానెల్తో ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. తన ఖరీదైన అలవాట్లను కొనసాగించేందుకు ఆయనకు డబ్బు అవసరం విపరీతంగా పెరిగిందని, తన లైఫ్స్టైల్ను మెయింటెయిన్ చేసేందుకు భారీ మొత్తాలు అవసరమయ్యాయని పేర్కొన్నాయి. అయితే మిలిటెంట్లు, ఆయుధాలతో ఆయన రెడ్హ్యాండెడ్గా పట్టుబడేవరకూ ఖర్చులను బాగానే నిర్వహించారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. కానీ, నాలుగు దశాబ్ధాలుగా తాను చేసిన సేవలు ఈ ఆరోపణలతో నీరుగారిపోయాయని విచారణ సందర్భంగా సింగ్ వాపోయారని చెప్పాయి.