పద్మవ్యూహం.. మనకు తెలియకుండానే ఈ పదం మనం చాలాసార్లు వాడుతుంటాం. పద్మవ్యూహంలో చిక్కుకుపోయామని అంటుంటాం.. ఏదైనా సమస్యల్లో చిక్కుకుంటే.. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా నా పరిస్థితి ఉందని చెబుతాం. కానీ అసలు ఈ పద్మవ్యూహం ఏంటి.. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి.. అభిమన్యుడి దాన్ని ఎందుకు చేధించలేకపోయాడు.. చూద్దాం..

 

 

పద్మవ్యూహం అనేది యుద్ధంలో సైన్యం అనుసరించే వ్యూహాల్లో ఒక వ్యూహం. ఇది శత్రు దుర్భేద్యం. అతిరథ మహారథులకే అంతుపట్టని పరమ రహస్యం. సైన్యం దీన్ని అనుసరిస్తే.. ఎదుటి సైన్యానికి చెందిన ఎంతటి వీరులైనా ఇందులోకి ప్రవేశించడం దుర్లభం. ఒకవేళ ప్రవేశించినా మళ్లీ ప్రాణాలతో వెనక్కి వెళ్లలేరు. మహాభారతంలో పద్మవ్యూహం చేధించడం తెలిసిన వారు నలుగురే.. శ్రీ కృష్ణుడు, అర్జునుడు, ప్రద్యుమ్ముడు, అభిమన్యుడు. అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి చెప్పడం వల్ల అభిమన్యుడికి పద్మవ్యూహ ప్రవేశం మాత్రం తెలుసు.

 

ఈ పద్మవ్యూహంలో ఏడు వలయాల్లో రథ, గజ, తురగ, పదాతి సైన్యాలతో రూపొందిస్తారు. తామరపువ్వు ఆకారంలో సైన్యాన్ని నిలుపుతారు. ఎంత ధీశాలి అయినా పద్మవ్యూహాన్ని చేధించడం కష్టం.. ఒకవేళ చేధించినా మళ్లీ వెనక్కు వెళ్లలేరు. అభిమన్యుడి విషయంలోనూ అదే జరిగింది. పద్మవ్యూహాన్ని చేధించడం గజ వధ ద్వారా జరగాలని అర్జునుడు సుభద్రకు చెప్పాడు. ఆమె గర్భంలో ఉన్న అభిమన్యుడు దాన్ని విన్నాడు కాబట్టి పద్మవ్యూహాన్ని చేధించ లోపలికి చొచ్చుకెళ్లి కౌరవ సైన్యాన్ని కకావికలం చేశాడు.

 

అభిమన్యుడి ధాటికి కౌరవ సేన బెంబేలెత్తిపోయింది. అభిమన్యుడికి తోడుగా భీముడు, దృష్టద్యుమ్నుడూ, ద్రుపదుడూ, సాత్యకీ, విరాటుడూ పద్మవ్యూహంలోకి ప్రవేశించారు. అయితే వారిని సైంధవుడు అడ్డుకున్నాడు. అర్జునుడిని తప్ప ఎవరినైనా ఒక రోజు పాటు నిలువరించే వరం సైంధవుడికి ఉంది. దీంతో పాండవసైన్యం.. సైంధవుడి ధాటికి కకావికలమైంది.

 

అభిమన్యుడు కర్ణుడిని మూర్ఛిల్లపోయేలా చేశాడు. శల్యుణ్ణీ, దుశ్యాసనుణ్ణీ కూడా స్పృహ తప్పేలా చేశాడు. పలువురు వీరులను సంహరించాడు. అభిమన్యుడిని కపటోపాయంతో తప్ప మరో విధంగా నిలువరించలేమని ద్రోణుడు చెబుతాడు. యుద్ధనీతికి వ్యతిరేకంగా అభిమన్యుడిపై కౌరవ యోధులంతా మూకుమ్మడిగా ధాటి చేస్తారు. అతని రధాన్ని విరగ్గొడతారు. నిరాయుధుడిని చేసి బాణాల వర్షం కురిపించారు.

 

అయినా వెరువని అభిమన్యుడు రథం చక్రం తీసుకుని గిరగిరా తిప్పుతూ రెచ్చిపోతాడు. కౌరవ యోధులు దాన్ని కూడా ముక్కలు చేస్తారు. చివరకు గదతోనూ పోరాడుతాడు. కానీ ఒక్కడు ఎంత సేపని పోరాడగలడు. చివరకు దుశ్శాసనుని కుమారుడితో జరిగిన ముఖాముఖి యుద్ధంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోతారు. ఈ పద్మవ్యూహం గురించి పురాణాల్లో ఉంది. అలాగే.. కర్ణాటకలోని హలిబేడు హోయసలేశ్వర దేవాలయంలోని శిల్పాల్లో అభిమన్యుడు పద్మవ్యూహంలో అడుగుపెడుతున్న దృశ్యం ఇప్పటికీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: