చంద్రబాబునాయుడు వ్యవహారం మొదటి నుండి విచిత్రంగానే ఉంటుంది. అవసరమైనపుడు నోరెత్తరు. అందరూ అనవసరం అనుకున్న సందర్భాల్లో నానా యాగీ చేస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే రాష్ట్రంలోని కొందరు వ్యక్తులపై ఐటి దాడులు జరిగాయి. పైగా ఐటి దాడులు చేసిందంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల మీదే. కానీ చంద్రబాబు మాత్రం దాడులపై ఎక్కడా నోరు కూడా విప్పలేదు.
ఐటి దాడులపై నోరిప్పటం లేదు అనేకన్నా భయపడిపోయారని అనుకోవటమే సబబుగా ఉంటుందేమో. ఎందుకంటే ఐటి దాడులు జరిగిన వాళ్ళల్లో తన దగ్గర ఐదేళ్ళ పాటు పిఎస్ గా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ కూడా ఉన్నాడు. మాజీ పిఎస్ అంటే ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబుకు కళ్ళు, చెవులుగా వ్యవహరించిన వ్యక్తి. ముఖ్యమంత్రికి ఐదేళ్ళు పిఎస్ గా పనిచేసిన కారణంగా ఇటు ప్రభుత్వంలోను అటు పార్టీలోను ఏకధాటిగా చక్రం తిప్పిన వ్యక్తనే చెప్పాలి.
అధికారంలో ఉన్నపుడు తన బినామీలుగా ప్రచారంలో ఉన్న సిఎం రమేష్, సుజనా చౌదరితో పాటు కొందరు టిడిపి నేతలపై సిబిఐ దాడులు జరిగితే ఎంత యాగీ చేసింది అందరూ చూసిందే. అసలు రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ లేకుండా కట్టడి చేసిన వ్యక్తి. అలాంటి చంద్రబాబు ఇపుడు మాత్రం ఐటి దాడుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కనీసం ప్రతిరోజు పార్టీ నేతలతో జరిగే టెలికాన్ఫరెన్సు లో కూడా ప్రస్తావన తేవటం లేదంటే ఎంతగా భయపడిపోయారో అర్ధమైపోతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 24 గంటలకు పైగా ఐటి శ్రీనివాస్ ను విచారిస్తునే ఉంది. ఇప్పటి వరకూ బయటపడిన సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల డాక్యుమెంట్లు బయటపడినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ ను గనుక ఐటి అధికారులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకుంటే అంతే సంగతులు. విచారణలో శ్రీనివాస్ నోరిప్పితే ఎంతమంది కొంపలు కూలిపోతాయో అనే టెన్షన్ పార్టీ నేతల్లో పెరిగిపోతోంది. ఆ భయంతోనే చంద్రబాబు ఐటి గురించి నోరెత్తటానికే భయపడిపోతున్నారు.