దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల విజేతలను నిర్దేశించేందుకు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. పోలింగ్లో ఓటర్లు చురుకుగా పాల్గొంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కాగా, కాళితార మండల్ అనే 111 ఏళ్ల బామ్మ ఓటు ఈ ఎన్నికల్లో ఆకర్షణగా నిలిచింది. . గత ఏడాది లోక్సభ ఎన్నికల్లోనూ ఈ బామ్మ ఓటు వేయడం విశేషం.
సీఆర్ పార్క్ సెంటర్లో ఓటేసిన అనంతరం బామ్మ తనను సంప్రదించిన మీడియాతో మాట్లాడుతూ...ప్రతి ఒక పౌరుడు ఓటు వేయాలని కోరింది. తనకు ఓటురు ఐడీ వచ్చిన నాటి నుంచి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లు ఆ బామ్మ చెప్పింది. ఓటు తనకు శక్తినిస్తుందని... ఓటు వేసే సందర్భాన్ని తాను ఎంతో ఎంజాయ్ చేస్తానని వెల్లడించడం విశేషం.
మరోవైపు...కుటుంబసమేతంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. యువ ఓటర్లు మొత్తం భారీ ఎత్తున పోలింగ్ బూత్లకు తరలిరావాలని కేజ్రీ కోరారు. యువత ఓటింగ్లో పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని కేజ్రీ అన్నారు. తన కుమారుడు తొలి సారి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నట్లు కేజ్రీ చెప్పారు. ఓటు వేసిన అనంతరం తమ ఫ్యామిలీ ఫోటోను సీఎం కేజ్రీ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దే విజయమని తన అంతరాత్మ చెబుతోందని ఆయన అన్నారు.ఈ సారి తప్పకుండా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. బీజేపీకే అనుకూల పవనాలు వీస్తున్నాయి. ప్రకంపనలు సృష్టించబోతుంది బీజేపీ అని ఆయన తెలిపారు.
ఇక ఈ ఎన్నికల్లో నూతన వరుడు, అతని కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వేసి తన ప్రాథమిక కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నానని పెళ్లి కుమారుడు చెప్పాడు. శాకర్పూర్లోని ఎంసీడీ ప్రైమరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన ఓటు వినియోగించుకున్నారు.