నవరత్న పథకాల అమలు విషయంలో  వైసీపీ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళ్తోంది. మిగిలిన అంశాల్లో కాస్తోకూస్తో తేడాలు జరిగినా చూసీ చూడనట్టు ఉంటుందేమో గానీ నవరత్నాలపై చాలా సీరియస్‌గా ఉంది. ఇంటింటికి పెన్షన్లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గతానికి భిన్నంగా అత్యంత త్వరగా.. పారదర్శకంగా పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని సర్కార్ నిర్ణయించుకుంది. దీనికి అనుగుణంగానే గ్రామ వాలంటీర్లు.. గ్రామ సచివాలయ సెక్రటేరీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజునే 90 శాతం మేర పెన్షన్లను పంపిణీని పూర్తి చేసింది ప్రభుత్వం. గతంలో ఇవే పెన్షన్లను పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజులు పట్టేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇంటింటికి పెన్షన్లను అమలు చేసే విషయంలో లబ్దిదారుల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాకే వస్తోంది. దీంతో పెన్షన్ల పథకం అమలులో మరిన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగా పెన్షన్ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపీడీవోల బ్యాంక్ ఖాతాలకు ఆ మండలానికి సంబంధించిన నిధులు వెళ్తాయి. అక్కడి నుంచి ఆ మండల పరిధిలోని గ్రామ సచివాలయాల సెక్రటరీ కన్వీనర్ కు పెన్షన్ల మొత్తాన్ని అందచేయడం ద్వారా లబ్దిదారులకు పెన్షన్లు జారీ ప్రక్రియ చేపడతారు. ఇప్పుడు దీనికి చిన్నపాటి సవరణ చేపట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది.  

 

రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపీడీవోలకు కాకుండా.. నేరుగా గ్రామ సచివాలయాల సెక్రటరీ కన్వనీర్ల ఖాతాలకు సదురు గ్రామాలకు చెందిన పెన్షనర్ల నిధులను పంపి.. జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా గ్రామాల నుంచి సదురు గ్రామ సచివాలయ సెక్రటేరీయేట్ కన్వీనరుకు మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పుతుందనేది సర్కార్ పెద్దల వద్దకు వచ్చిన ప్రతిపాదన. 

 

మరోవైపు పెన్షన్లను మరింత మందికి అందించేలా చర్యలు ప్రారంభించింది సర్కార్. గతంలో ఉన్న పెన్షన్లతో పోల్చుకుంటే ప్రస్తుతం పెన్షన్లు భారీ స్థాయిలో కోతలు విధించినట్టు విమర్శలు వస్తుండటంతో వీలైనంత మందికి పెన్షన్ల అర్హుల జాబితాలో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంతో పోల్చుకుంటే సుమారు రెండు లక్షలకు పైగా లబ్దిదారులకు అదనంగా పెన్షన్లు జారీ చేస్తున్నా.. ఇంతకు ముందున్న జాబితాలో ఉన్న వారిలో 4 లక్షల 16 వేల 34 మందిని అనర్హులుగా ప్రకటించారు. అయితే ఈ అనర్హుల జాబితాను పునః పరిశీలించడం ద్వారా మరింత మందికి పెన్షన్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అలాగే 300 యూనిట్ల మేర విద్యుత్తును వినియోగించుకోవడంతో సుమారు 8900 మంది అర్హత కొల్పోయారు. ఈ జాబితాను కూడా పునః పరిశీలించడం ద్వారా ఇంకొంత మందికి పెన్షన్ సౌకర్యం కల్పించాలనేది సర్కార్ సంకల్పం.

 

నవ రత్నాల పథకాల అమలు విషయంలో.. మరీ ముఖ్యంగా పెన్షన్లు, అమ్మఒడి వంటి పథకాల్లో ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవడం.. దానికి అనుగుణంగా అమల్లో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసుకోవడమనేది నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలనే భావన ప్రభుత్వ పెద్దల్లో కన్పిస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి: