నేడు ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోజు అభ్యర్థుల భవితవ్యం ఎంతో ఓటర్లు తేల్చనున్నారు. కాగా పోలింగ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో... ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను మరింతగా పెంచారు. కాగా ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాల వద్ద తమ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇక సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ అంతా ప్రశాంతంగా జరిగిపోతున్న సమయంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.
మజ్ను కా తీల దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి ఆల్క లాంబా ఆప్ పార్టీ కార్యకర్త చెంప చెల్లుమనిపించేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్ట్ అయినా ఆ వ్యక్తి పక్కకు తప్పుకున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా చేయి చేసుకునేందుకు ప్రయత్నించడం పై ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రం వద్ద ఒకరినొకరు తోసుకున్నారు కాంగ్రెస్ ఆప్ పార్టీ కార్యకర్తలు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు కలుగజేసుకొని ఇరు పార్టీల కార్యకర్తలను విడదీసి అక్కడి నుంచి పంపేశారు.అయితే కాంగ్రెస్ నేత అల్కా లాంబ ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఎలక్షన్ కమిటీ ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద హాట్హాట్ వాతావరణం నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు... పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఇప్పటికే అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. ఇక పలు చోట్ల ఈవీఎం మిషన్స్ సరిగా పనిచేయక పోవడంతో ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలింగ్ 9 గంటలకు ప్రారంభమైంది. కాగా ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులందరికీ తమ వైపు ఎక్కువ ఓట్లు పడాలని ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు.