తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారు అంటూ పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యాల పై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యపేటలో స్థానిక పురపాలక సంఘం చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని గాంధీ పార్క్ లో చైర్మన్ కు జరిగిన పౌర సన్మానం లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రధాని నరేంద్రమోడీపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పధకాలు యావత్ భారతదేశంలో కొత్త చర్చకు తెరలేపాయన్నారు.దాంతో భయం పట్టుకున్న మోడీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

 


గుజరాత్ తో పాటు యావత్ భారతదేశంలో తెలంగాణ పధకాలపై చర్చ జరుగుతోందని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. `` తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన రెండు వేలు, మూడు వేల పెన్ష‌న్‌లు అటు గుజరాత్ లో ఇటు యావత్ భారతదేశంలో ఎందుకు అమలు చేయడం లేదు. 15 ఏళ్లు గుజరాత్‌ను ప‌రిపాలించిన మోడీ ఆ రాష్ట్రంలో కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్ వంటి పథకాలకు ఎందుకు రూపకల్పన చెయ్యలేకపోయారు? రైతుబందు,రైతు బీమా తామెందుకు కళ్ళ చూడలేకపోయామన్న బాధ గుజరాత్ తో పాటు యావత్ భారత రైతాంగాన్ని వెంటాడుతోంది. కొత్త రాష్ట్రం తెలంగాణలో మూడేళ్ల‌ కే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించగలిగినప్పుడు ఆరు ఏండ్లు ప్రధానిగా 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వ లేక పోయారు? దేశ ప్రజల నుండి వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భ‌యంతోనే పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దాడికి దిగుతున్నారు`` అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు. 

 

 

ఏ సందర్భం లేకున్నా ఉభయ సభలలో తెలంగాణా ఇవ్వడమే అన్యాయం అన్న పద్దతిలో మాట్లాడుతున్నార‌ని మంత్రి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ``తెలంగాణా ఏర్పడకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదని ,నాకు ఈ చిక్కులు వచ్చేవి కావని మోడీ భావిస్తున్నారు. అందుకే ఆయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారు`` అని జ‌గ‌దీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: