పొరుగున ఉన్న పాకిస్థాన్ గురించి, ఆ దేశం చేసే తప్పుడు పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్ విషయంలో ఆ దేశం వైఖరి తీవ్ర వివాదాస్పదం. అయితే, తాజాగా పాక్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. న్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లని బహిరంగంగా ఉరితీయాలనే తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికమంది సభ్యులు ఓటేశారు. పాకిస్థాన్లో ఇప్పటివరకు ఉరిశిక్షలు అమలులో ఉన్నాయి. కానీ, బహిరంగ ఉరి అమలు లేదు.
పాక్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. రేపిస్టులకు మరణశిక్ష తాత్కాలికంగా ఆపేయాలని మానవ హక్కుల సంఘాలు చాలాకాలంగా కోరుతున్నాయి. తాత్కాలిక నిషేధాన్ని అమలుచేసిన తరువాత పాకిస్తాన్లో పిల్లల లైంగిక వేధింపుల కేసులు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పాకిస్తాన్ అంతటా పిల్లల లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో పార్లమెంటులో ప్రత్యేకంగా చర్చ నిర్వహించారు. ‘చైల్డ్ కిల్లర్స్ మరియు రేపిస్టులకు ఉరిశిక్ష విధించడమే కాదు, వారిని బహిరంగంగా ఉరి తీయాలి’ అని పాకిస్తాన్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అలీ ముహమ్మద్ ఖాన్ అక్కడి అసెంబ్లీలో తీర్మానాన్ని సమర్పించారు. ఈ తీర్మానాన్ని మెజారిటీ శాసనసభ్యులు ఆమోదించినప్పటికీ.. ప్రభుత్వం దీన్ని సమర్థించలేదని మానవ హక్కుల మంత్రి షిరీన్ మజారి తెలిపినట్టు సమాచారం. ‘బహిరంగ ఉరి అనేది వ్యక్తిగత చర్య. దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మానవ హక్కుల మంత్రిత్వ శాఖ కూడా ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్నారులపై పాక్ సంచలన నిర్ణయానికి ముందు మైనర్లపై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ మరియు అక్రమ రవాణాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్ 2016 మార్చిలో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది. గతంలో అత్యాచారం మరియు అసంబద్ధ లైంగిక చర్యలకు మాత్రమే చట్టం ప్రకారం శిక్ష ఉండేది. ఈ కొత్త చట్టంతో వేధింపులకు కూడా ఉరి శిక్షను అమలు చేయనున్నారు. తద్వారా పాక్ బాలికల రక్షణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు అయింది.