అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిపక్ష టీడీపీ పార్టీతో పాటు ఆ పార్టీ అధికారంలో ఉండగా పనిచేసిన ప్రభుత్వ అధికారులను కూడా టార్గెట్ చేసి ఇబ్బందుల పాలు చేస్తుందని టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. మాజీ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెషన్పై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ చర్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
`రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్టుగా విన్న అధికారులు కోర్టు చుట్టూ తిరగుతున్నారు. అయినా మేం అలాంటి వారిని కూడా చాలా గౌరవప్రధంగా చూశాం. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. ఇలాంటి చర్యల వల్ల ఓ వర్గం అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే కొనసాగితే తరువాత వచ్చే ప్రభుత్వం మరో వర్గం మీద ఇలాంటి చర్యలకే దిగుతుంది. ఇలాంటి కక్షసాధింపు ఎవరు చేసినా తప్పే.
రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు.. కానీ అందులోకి ప్రభుత్వ అధికారులను లాగటం తప్పు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరు. కాబట్టి ఈ సస్పెన్షన్ అంశం మీద పునరాలోచించాలి` అన్నారు. అదే సమయంలో కౌన్సిల్లో జరిగిన పరిణామాలపై కూడా స్పందించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందన్నారు, కౌన్సిల్లో బిల్లును చెక్ చేసే అధికారం ఉందని తెలిపారు.
నిపుణుల అభిప్రాయాలు తెలుసుకునేందుకే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపుతారు. ఎక్స్పర్ట్ ఒపినీయన్ తీసుకునేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి..? ఒక మూడు నెలల ప్రాసెస్కు ప్రభుత్వం ఎందుకు ఇలా రాద్ధంతం చేస్తోంది. మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయటానికి మెంబర్స్ పేర్లు తీసుకోవడానికి అధికారులు కూడా వెనకాడుతున్నారన్నారు. ఇప్పటికే సెలెక్ట్ కమిటీ వేస్తూ చైర్మన్ ఆర్డర్ ఇచ్చినా.. ఆ ఆర్టర్ పాస్ కాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని తెలిపారు. అసెంబ్లీని ఇష్టం వచ్చినట్టు నడుపుకుంటున్న వైసీపీ నాయకులు, కౌన్సిల్లో మాత్రం రూల్స్ పాటించాలనటం హాస్యాస్పదంగా ఉందన్నారు.