రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ హాట్ సమాచారంతో ప్రజలకు చేరువైన ఓ దమ్మున్న మీడియాలో ఈ ఏడాది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కట్ చేస్తున్నారనే వార్త తెలుగు మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అదే సమయంలో పొదుపు చర్యల్లో భాగంగా కార్యాలయాల్లో ఏసీలను కూడా బంద్ చేయాలని సర్క్యులర్ జారీ చేసిందట! దీంతో ఇది మరింత ఆసక్తిగా మారింది. విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆర్తిక మందగమనం దేశాన్ని కుదిపేస్తోంది.దీంతో ప్రైవేటు సంస్థలు ఉద్యోగులకు అనేక రకాల ఆంక్షలు విధిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల సృష్టి అటుంచితే.. ఉన్న ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించేందుకే ఇబ్బంది పడుతున్నాయనేది వాస్తవం.
అయితే, ఈ పరిస్థితి కొత్తగా స్థాపించిన సంస్థలకు వర్తిస్తుందంటే నమ్మొచ్చు. కానీ, రెండు తెలుగు రాష్ట్రా ల్లో నూ ప్రభుత్వాలను మచ్చిక చేసుకుని గడిచిన ఐదేళ్లలో వందల కోట్లలో లాభాలు పొందిన దమ్మున్న పత్రికలో నూ ఇలాంటి పరిస్థితి వచ్చిందంటేనే ఆసక్తిగాను ఆశ్చర్యంగాను అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. పక్కవారికి ఏదైనా చిన్న నొప్పి కలిగితే.. ఈ మీడియా అధిపతి.. డిఫరెంట్ పలుకులతో జనాలను ఊదరగొట్టి.. సదరు సంస్థను చీల్చి చెండాడేస్తాడు.
ముఖ్యంగా జగన్ కు సంబంధించిన మీడియాలో ఏదైనా జరిగితే.. చిలవలు పలవలు చేసి ప్రపంచానికి చేరవేస్తాడు. కానీ, తన దాకా వస్తే మాత్రం మౌనంగా అమలు చేస్తున్నాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉద్యోగులకు ఇచ్చే 5 శాతం ఇంక్రిమెంటును కూడా నిలిపి వేస్తున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు లబోదిబో మంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయి.. ఇంటి అద్దెలు ఆకాశానికి అంటుతున్న తరుణంలో పిల్లలను ఎలా చదివించుకోవాలి? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి పెద్దగా ఆదాయం లేని ప్రజాశక్తి, విశాలాంధ్ర వంటి సంస్థల్లోనే ఏటా క్రమం తప్పకుండా అంతో ఇంతో ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నారు. ఇక, ఈనాడు, సాక్షి వంటివాటిల్లో యాజమాన్యాలు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నా.. ఇంక్రిమెంట్లు ఎప్పుడూ ఆపలేదు. కానీ, ఇప్పుడు దమ్మున్న మీడియా మాత్రం చెప్పేందుకు మాత్రమే నీతులు, చేసేందుకు కాదు.. అని నిరూపించుకుంటోందట!