ఎట్టకేలకు ఢిల్లీ ఎలక్షన్స్ పోలింగ్ పర్సంటేజ్ తేలింది. ఓటింగ్ ముగిసిన 24 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని తేల్చింది ఎన్నికల సంఘం. మొత్తం మీద 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. అయితే ఈ ఆలస్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇంత ఆలస్యంగా పోలింగ్ శాతాన్ని ప్రకటించడం వెనుక మతలబు ఏంటని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.  అక్రమంగా ఈవీఎంలను తరలించి ఉంటారని ఆరోపిస్తున్నారు.

 

ఢిల్లీ ఎన్నికల్లో 62.59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత ఓటింగ్ శాతాన్ని ప్రకటించడంపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.  ఈసీ తీరు తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఎన్నికల సంఘం అధికారులు నిద్రపోతున్నారా?  పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత ఓటింగ్ శాతాన్ని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు..

 

ఈవీఎంను ట్యాంపర్ చేసే కుట్ర జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలను ఆప్ నేతలు పోస్ట్ చేశారు. బాబర్ పూర్‌లోని ఓ పోలింగ్ స్టేషన్‌లో కొన్ని ఈవీఎంలను వాడకుండా పక్కన పెట్టినట్లు తాము గుర్తించినట్లు ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. 

 

ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఆప్ నేతల ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. ఖచ్చితమైన సమాచారం అందించడం కోసమే ఆలస్యం జరిగిందని, కొన్ని చోట్ల పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్ల క్యూలో నిల్చోవడం వల్ల పోలింగ్ శాతంపై క్లారిటీ రాలేదన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత  రాత్రి 10.17కు 61.43శాతం పోలింగ్ జరిగినట్లు తాము యాప్‌లో అప్‌డేట్ చేసినట్లు  ఎన్నికల సంఘం అధికారి రణ్‌బీర్ సింగ్ చెప్పారు..

 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు ఈసీకి సంబంధించిన యాప్‌లో అ‌ప్‌డేట్ చేస్తూ వచ్చారు. కానీ వాస్తవ పరిస్థితుల కంటే అందులో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉంది. మొత్తం డాటా  ఎన్నికల సంఘానికి వచ్చి, దాన్ని అనలైజ్ చేసేసరికి ఆలస్యం అయిందని, అందుకే  పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించామని ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67.5 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సారి దాదాపు ఐదు శాతం పోలింగ్ తగ్గింది. 

 

ఢిల్లీలో మొత్తం70 స్థానాలకు పోలింగ్ జరుగగా....గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67స్థానాలను గెలుచుకుంది. ఈ సారి కూడా కేజ్రీవాల్ సీఎంగా పగ్గాలు చేపడతారని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగనుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: