రాజధాని అమరావతి రైతులు వేసిన ఓ కేసుతో చంద్రబాబునాయుడుకు షాక్ తగిలినట్లైంది. వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పెడదామని కోర్టులో కేసు వేశారు కానీ చివరకు ఆ కేసు చంద్రబాబు మెడకు చుట్టుకోవటం ఖాయం. ఇంతకీ విషయం ఏమిటంటే తమ దగ్గర భూసమీకరణ చేసేసమయంలో హామీ ఇచ్చినట్లుగా సిఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను మూడేళ్ళల్లో ఇవ్వలేదంటూ రైతులు కోర్టులో కేసు వేశారు.
మరి రైతులకు కోర్టులో కేసు వేయమని ఎవరు సలహా ఇఛ్చారో తెలీదు. ఎందుకంటే రైతుల నుండి బలవంతంగా భూములు లాక్కున్నది, కొందరి నుండి భూములు తీసుకున్నది చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో భూములు తీసుకునేటపుడు నోటికొచ్చిన హామీలు ఇచ్చేశారు చంద్రబాబు. అవసరానికి పబ్బం గడుపుకునేందుకు అలవికానీ హామీలివ్వటం చంద్రబాబుకు బాగా అలవాటే. ఇందులో భాగంగానే భూసమీకరణ చేసిన మూడేళ్ళల్లో అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లను ఇస్తానంటూ గొప్పగా ప్రకటించేశారు.
సీన్ కట్ చేస్తే సేకరించిన 34 వేల ఎకరాల్లో ఏ ఒక్కరికీ ఎటువంటి ప్లాటూ ఇవ్వలేదు. అసలు చాలామందికి ప్లాట్లే ఇవ్వలేదు. రైతుల నుండి భూసమీకరణ చేసిన చంద్రబాబు తిరిగి వాళ్ళకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వటానికి ఇష్టపడలేదు. పైగా భూమి రైతుల నుండి తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వ, ప్రైవేటు సంస్ధలకు మాత్రం తనకు తోచిన ధరలకు అమ్మేశాడు.
అంటే రైతులు వేసిన కేసుతో చంద్రబాబు చేతకానితనాన్ని బయటపెట్టటమే అవుతుంది. ఎందుకంటే భూములు తీసుకున్నది చంద్రబాబు, హామీ ఇచ్చింది చంద్రబాబు కాబట్టి అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇవ్వాల్సింది కూడా చంద్రబాబే. రైతులు వేసిన తాజా కేసుతో చంద్రబాబు చేతకానితనమే బయటపడుతుంది. ఇక అమరావతి నుండి రాజధాని తరలింపు అంటారా అది జగన్మోహన్ రెడ్డి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఏదో ఓ కేసు వేసి రాజధాని తరలింపును ఆపేద్దామని రైతులు అనుకుంటే వాళ్ళది అమాయకత్వమే అవుతుంది.