రాష్ట్రం లో ఇప్పట్లో ఎన్నికలు లేవు కాబట్టి ఇక దృష్టంతా పాలనపైనే పెట్టాలని.. కలెక్టర్లకు ఆదేశాలివ్వబోతున్నారు సీఎం కేసీఆర్. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించనున్నారు. పల్లె ప్రగతిని సమీక్షించి.. పట్టణ ప్రగతి, వివిధ చట్టాల అమలుపై మంగళవారం ముఖ్యమంత్రి చర్చించనున్నారు.
జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్... మంగళవారం సమావేశం నిర్వహించబోతున్నారు. గతేడాది అక్టోబర్10న జరిగిన మీటింగ్కు ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయి.. 20కి పైగా జిల్లాలకు కలెక్టర్లు మారగా.. కొత్తగా 12మంది కలెక్టర్లయ్యారు. జాయింట్ కలెక్టర్ల స్థానంలో అడిషనల్ కలెక్టర్ల వ్యవస్థ వచ్చింది. ఒక్కో జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లు ఉండనున్నారు. దీంతో సీఎం చేయనున్న మార్గనిర్దేశనంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పల్లెప్రగతి లాగే.. త్వరలోనే పట్టణ ప్రగతి చేపడతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది. తేదీలను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. హరిత హారం పైనా రివ్యూ చేసే ఛాన్స్ ఉంది.
కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ రాజ్ , మునిసిపల్ చట్టాల అమలుపై కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడనున్నారు. కొత్త రెవెన్యూ చట్టం పై కూడా కలెక్టర్ల అభిప్రాయం తీసుకోనున్నారు. అడిషనల్ కలెక్టర్ ల బాధ్యతల పై కూడా సీఎం స్పష్టతనివ్వనున్నారు.
రాష్ట్రంలో దాదాపుగా అన్ని రకాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి.. ఇక పూర్తిస్థాయిలో పాలనపై దృష్టిపెట్టాలని కలెక్టర్లకు సూచించనున్నారు కేసీఆర్. అక్షరాస్యత శాతం పెంచేందుకు కేసీఆర్ గతంలో ప్రకటించిన ఈచ్ వన్ టీచ్ వన్ పథంపైనా సమావేశంలో చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సీఎం కేసీఆర్ పాలనపై మరింత దృష్టి సారిస్తున్నారు. కలెక్టర్ల ద్వారా అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రేపు కలెక్టర్లతో భేటీ అవుతున్నారు.