ఏబీ వెంకటేశ్వరరావు.. ఆంధ్రా ఐపీఎస్ ఆఫీసర్.. ఇటీవలే జగన్ సర్కారు ఈయన్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఈయన గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈయన తెలుగుదేశం పక్షపాతి అన్న ఆరోపణలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ఎన్నికల ముందు ఈయన టీడీపీలో చాలా కీలక పాత్ర పోషించాడని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటారు. మొత్తానికి ఇప్పుడు సస్పెండ్ అయ్యారు.

 

అయితే.. ఈ ఏబీ వెంకటేశ్వరరావు లీలలు ఏపీతోనే ఆగిపోలేదంటున్నారు వైసీపీ నాయకులు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడని విమర్శిస్తున్నారు. ఆయన అవినీతి సొమ్ముతో తెలంగాణలోనూ భూములు కొనుగోలు చేశారట. అంతే కాదు.. ఆ భూములకు రైతుబంధు పథకం ద్వారా రూ.67 లక్షలు తీసుకున్నాడట. ఈ విషయాలను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.

 

దేశ భద్రతను కాపాడాల్సిన ఒక ఐపీఎస్‌ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ విభాగం డీజీగా ఉండి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడ్డారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు అవినీతి అక్రమాలు మరికొన్ని త్వరలోనే బయట పెడతానన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంతే కాదు.. అవినీతి తిమింగలం అయిన ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనపై సంఘ విద్రోహం కింద కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

 

ఏబీ వెంకటేశ్వరరావు దేశం విడిచిపెట్టి పోయే ప్రమాదం ఉందని.. కేంద్రం వెంటనే లుకౌట్‌ నోటీసులు విడుదల చేయాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోరారు. దేశ భద్రత దృష్ట్యా మాట్లాడుతున్నానని, అతనిపై తనకు వ్యక్తిగత కక్షలేమీ లేవని చెవిరెడ్డి వివరించారు. ఘట్టమనేని శ్రీనివాస్‌ అనే వ్యక్తి ఏబీ వెంకటేశ్వరరావు బినామీ అని చెవిరెడ్డి అంటున్నారు. ఏబీవీ.. అవినీతి అక్రమాలు మిగతా ఐపీఎస్‌ అధికారులకు కూడా తెలుసన్నారు. విజయవాడ జంట హత్యల కేసులో కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు కాజేశాడని చెవిరెడ్డి ఆరోపించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: