70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు అయినప్పటికీ...దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను కలుగజేసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో ఊహించిందే నిజమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు చీపురుకే జైకొట్టాడని, 50కి పైగా నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరనుందని ఎగ్జిట్పోల్స్ వెల్లడించడం అక్షరసత్యం అయింది. దాదాపుగా అన్ని ఎగ్జిట్పోల్స్ లో కాస్త అటూఇటూగా ఇవే ఫలితాలు వెలువరించగా... సీఎంగా కేజ్రీవాల్కు ఢిల్లీ ఓటర్లు మరోమారు అవకాశమిచ్చారు.
పోలింగ్ అనంతరం వివిధ సంస్థలు ఎగ్జిట్పోల్స్ వెలువరించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుని తిరిగి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పాయి. ఆప్ తర్వాతి స్థానంలో బీజేపీ నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ చతికిలపడిందని తెలిపాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 54 నుంచి 59 సీట్లు, బీజేపీ 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్ 0 నుంచి 2 సీట్లు గెలుచుకుంటాయని పీపుల్స్ పల్స్ ప్రెడిక్షన్ సర్వే సంస్థ అంచనా వేసింది. చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని తెలిపింది. సంక్షేమ పథకాలే ఆప్ సర్కారుకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టనున్నాయని చెప్పింది. టైమ్స్ నౌ, న్యూస్ ఎక్స్ నేతా, రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, జన్కీ బాత్, ఇండియా న్యూస్ నేషన్ తదితర సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించబోతోందని వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 48 సీట్లు రావడం ఖాయమని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ పేర్కొన్నప్పటికీ...ఆయన ప్రకటన కేవలం ప్రకటనగానే మిగిలింది.
కాగా, ఇక ఢిల్లీ పోరులో మొత్తం 70 స్థానాలుండగా.. 672 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గత ఎన్నికలో ఆప్ 67 స్థానాల్లో గెలవగా… బీజేపీ మూడు స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమించాయి. 2015లో 67 శాతం పోలింగ్ నమోదు కాగా… ఈ ఎన్నికల్లో 62 శాతానికి తగ్గింది. అత్యల్పంగా ఢిల్లీ కంటోన్మెంట్లో 45.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా బల్లిమారన్ నియోజకవర్గంలో 71.6 శాతం పోలింగ్ శాతం నమోదైంది. అయితే… పోలింగ్ శాతం ప్రకటించడంలో ఆలస్యం కారణంగా ఈసీ విమర్శలు ఎదుర్కొంది. దీనిపై పలు పార్టీలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. విమర్శలపై స్పందించిన ఢిల్లీ ఈసీ రణ్ బీర్ సింగ్… స్క్రూటినీలో అధికారులు బిజీగా ఉండటం కారణంగానే ఆలస్యమైందని వెల్లడించారు.