ఈ రోజు ఢిల్లీలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ప్రధాన పార్టీలు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ ల మద్య పోటీ జరిగింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం పొందింది. ఇక బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయం దక్కేలా కనిపిస్తుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం దిశగా దూసుకెళుతోన్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో టపాసులు పేల్చొద్దని తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. తాజాగా ఢిల్లీ ఫలితాలపై ప్రముఖ రాజకీయ నేతలు తమదైన కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇండియా ఆత్మను గెలిపించారని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఇండియా ఆత్మను రక్షించుకునేందుకు అండగా నిలిచిన ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఫలితాలపై సినీ నటుడు ప్రకాశ్రాజ్ సంచలన కామెంట్స్ చేసారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకులు సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిపై కాల్చి వేయాలని(గోలీ మార్) అన్నారు. అలాంటి వ్యక్తులకు ఢిల్లీ ఓటర్లు చీపుర్లతో ఊడ్చిపారేసరని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్కు సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అభినందనలు తెలిపారు.
దేశంలో ప్రజలను హింసించే, ద్వేషించే రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఏచూరీ పేర్కొన్నారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించారు. ఫలితాల్లో ఆప్ విజయం పట్ల సీఎం కేజ్రీవాల్కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మమత బెనర్జీ మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు బీజేపీని తిరస్కరించారని అన్నారు. కేవలం అభివృద్ధి మాత్రమే ఎన్నికల విజయానికి పని చేసిందని తెలిపారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ను ప్రజలు వ్యతిరేకించారని అన్నారు.