ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా ఉండే నగరం విజయవాడ(బెజవాడ). ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు రంజుగానే ఉంటాయి. అయితే ఇలాంటి నగరం కాబట్టే అన్నీ పార్టీలు నగరంపై పట్టు సాధించాలని పోటీ పడుతుంటాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు గత పదేళ్ళ నుంచి ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే 2014 ఎన్నికల తర్వాత నుంచి చూసుకుంటే విజయవాడలో టీడీపీకి మంచి గ్రిప్ దొరికింది.
ఆ ఎన్నికల్లో టీడీపీ నగరంలో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండిటిలో, ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. తర్వాత విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ తరుపున గెలిచిన జలీల్ ఖాన్ని కూడా పార్టీలోకి తీసుకోవడంతో నగరంపై పూర్తి ఆధిపత్యం దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం దారుణంగా ఓడిపోయిన టీడీపీ, విజయవాడ నగరంలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటుని దక్కించుకుంది. వెస్ట్, సెంట్రల్ స్థానాలని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఈస్ట్లో 15 వేలపైనే మెజారిటీతో గెలిచిన టీడీపీ, సెంట్రల్ని కేవలం 25 ఓట్ల తేడాతో, వెస్ట్ని 7 వేల ఓట్ల తేడాతో కోల్పోయింది.
కొంచెం తేడాతో ఓడిపోవడం బట్టి చూస్తే విజయవాడ నగర ప్రజలు టీడీపీ పట్ల బాగానే పాజిటివ్ గానే ఉన్నారని చెప్పొచ్చు. రాజధాని అమరావతి పక్కన ఉండటం వల్ల కావొచ్చు, నగర ప్రజలు టీడీపీని ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో గెలిపించారు. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో నగరంపై టీడీపీ పట్టు నిదానంగా కోల్పోతూ వస్తుందని అంతా అనుకున్నారు. కానీ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో టీడీపీకి కాస్త మైలేజ్ పెరిగింది.
విజయవాడ వాసులు మూడు రాజధానులని వ్యతిరేకిస్తున్నారు. ఫలితంగా వైసీపీపై నెగిటివ్ పెరిగి, టీడీపీకి కలిసొచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నగరంలో టీడీపీ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. ఇదే పరిస్తితి కొనసాగితే రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడని కైవసం చేసుకునే అవకాశం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది.