హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆద్మి) అధ్యక్షుడు కాబోయే సిఎం అరవింద్ కేజ్రీవాల్ ను చూసి చంద్రబాబునాయుడు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అసలు చంద్రబాబుకు కేజ్రీవాల్ కు మధ్య తేడాలు చాలా ఉన్నాయి. ఆ తేడాలు తెలుసుకోలేకే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మొన్నటి ఎన్నికల్లో బోల్తా పడ్డాడు. తాజాగా కేజ్రీవాల్ ఇంత ఘన విజయం సాధించటానికి కారణాలపై చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.
ఇంతకీ కేజ్రీవాల్ ఇంతటి ఘన విషయం వెనుక ప్రధాన కారణాలేమిటి ? ఏమిటంటే గ్రోత్ రేట్ అని, జిడిపి అని మామూలు జనాలకు అర్ధంకానీ మాటలు మాట్లాడలేదు. సామాన్య జనాలకు ఏది అవసరమో అంటే మంచినీటి సరఫరా, విద్య, వైద్యంపై ప్రధానంగా దృష్టి పెట్టాడు. విద్యుత్ చార్జీలు పెరగకుండా నియంత్రించాడు. రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాల్లాంటి మౌళిక సౌకర్యాలు కల్పించాడు.
పనిలో పనిగా అవినీతికి చాలా దూరంగా ఉన్నాడు. తన మంత్రివర్గంలోని సభ్యులను అవినీతికి దూరంగా ఉంచాడు. ఏ పథకం అమలు చేసినా జనాలకు పూర్తిగా చేరేలా చర్యలు తీసుకున్నాడు. దాంతో ప్రభుత్వంపై క్లీన్ ఇమేజి వచ్చింది. అయినదానికి కానీ దానికి నరేంద్రమోడితో కయ్యానికి పోలేదు. అదే సమయంలో తనను మోడి ఇబ్బందులు పెట్టటానికి ప్రయత్నించినపుడు గట్టిగా బదులిచ్చాడే కానీ దాన్ని రోజుల తరబడి కంటిన్యు చేయలేదు. అసెంబ్లీలో ప్రతిపక్షమైన బిజెపి జోలికి పోలేదు.
అదే సమయంలో చంద్రబాబు ఏమి చేశాడు ? ఏ ప్రాజెక్టు చూసినా, ఏ పథకం తీసుకున్నా అవినీతి కంపే. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని రాచి రంపాన పెట్టాడు. వైసిపి నేతలపై లెక్కలేనన్ని తప్పుడు కేసులు పెట్టాడు. ఫిరాయింపులకు తెరతీశాడు. ఆచరణ సాధ్యంకానీ లక్షల కోట్ల రూపాయలతో ప్రపంచస్ధాయి రాజధానంటూ అమరావతిని భ్రమరావతిగా మార్చేశాడు. మంత్రివర్గంలో చాలామందిపై అవినీతి ఆరోపణలే.
అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడా మీడియాను మ్యానేజ్ చేసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించలేదు. పాదర్శకతకు పెద్ద పీట వేశాడు. పార్టీని ప్రభుత్వ యంత్రాంగాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశాడు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు ఇదే పద్దతిలో వెళుతున్నాడు. కాబట్టి కేజ్రీవాల్ ను చూసి చంద్రబాబు ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకుంటాడా ?