తెలంగాణకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోం రామేశ్వర్ రావుకు కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ఊహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. రాయదుర్గంలో వందలకోట్లు విలువచేసే భూమిని మైహోంకు కేటాయించారని, ఇందులో అక్రమాలు జరిగాయని పేర్కొంటూ భూ కేటాయింపులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ. 38 కోట్ల స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారని రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది కూడా. ఇదిలాఉంటే, మరోవైపు హైఎండ్ లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డును సృష్టించింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో దాదాపు 325 అత్యాధునిక ఫ్లాట్లను విక్రయించి తమ ప్రత్యేకతను మైహోం చాటుకుంది.
పశ్చిమ హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న కోకాపేట్లో సుమారు 5.82 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో.. ‘మై హోమ్ తర్క్ష్య’పేరుతో సంస్థ ఓ ప్రాజెక్టు నిర్మిస్తోంది. ఇందులోని 660 ఫ్లాట్లన్నీ ఆధునిక లగ్జరీ గృహాలే కావడం గమనార్హం. ఉదయం కోకాపేట్లో శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి ‘మై హోమ్ తర్క్ష్య’ ప్రాజెక్టుకు భూమి పూజ చేసిన అనంతరం బ్రోచర్ను ఆవిష్కరించారు. మొదటి రోజే రికార్డు స్థాయిలో దాదాపు 325 అత్యాధునిక ఫ్లాట్లను విక్రయించినట్లు సమాచారం.
కాగా, ఈ వెంచర్ను మైహోం గ్రూపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జి+ 32 అంతస్తుల ఎత్తులో కడుతున్న నాలుగు బ్లాకుల్లో అన్నీ ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లే. కేవలం రెండు సైజుల్లో, 1,957, 2,235 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లకు రూపకల్పన చేశారు. వైవిధ్యమైన డిజైన్లు, ఆకట్టుకునే ఎలివేషన్లు, ఆధునిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు వంటి వాటితో పాటుగా ఇతర అధునాతన సదుపాయాలన్నీ కల్పించినట్లు సమాచారం.అందుకే కొందరు కొనుగోలుదారులు.. ‘మై హోమ్ తర్క్ష్య’లో మొదటి రోజే తీసుకున్నారని అంటున్నారు. ఓవైపు ఊహించని పిటిషన్ దాఖలైనప్పటికీ..మరోవైపు మైహోంకు క్రేజ్ తగ్గలేదని పలువురు చర్చించుకుంటున్నారు.