తాజాగా టీడీపీ అదినేత చంద్రబాబు తన పార్టీ నాయకులను బారీ ఎత్తున సన్మానించారు. శాసన మండలికి చెందిన సభ్యులను ఆయన శాలువా కప్పి.. మొమెంటోలు ఇచ్చి.. పుష్పగుచ్ఛాలతో భారీ ఎత్తున సన్మానిం చారు. విజయవాడలోని కానూరు అన్నేవారి కల్యాణ మండపంలో టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరిగింది. పొలిట్బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కాల్వ శ్రీనివాసులు, వర్ల రామయ్య, ప్రతిభా భారతి, గల్లా అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అదే సమయంలో శాసన మండలి సభ్యులను ఆయన ఘనంగా సన్మానించారు. యనమల రామకృష్ణుడు, బుద్ధా వెంకన్న, అచ్చుల అర్జునుడు సహా పలువురిని చంద్రబాబు సన్మానించారు. ఇక, చంద్రబాబు తన యుడు, మాజీ మంత్రి లోకేష్ను యనమల ఘనంగా సన్మానించారు. ఈ పరిణామంపై చంద్రబాబు ఆసక్తిగా స్పందించారు. ఎమ్మెల్సీలు శాసన మండలిలో వీరోచితంగా పోరాడారని చెప్పుకొచ్చారు. వారిని సన్మానించు కోవాల్సిన అవసరం, ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అయితే, ఈ క్రమంలో వారు సాధించింది ఏంటో మాత్రం ఆయన చెప్పలేక పోయారు. మండలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు వ్యాఖ్యలు చేయడంతోనే అన్నీ సాధించారా ? లేక, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపామని, తద్వారా జగన్ను ఎండగట్టామని భావించి చంద్రబాబు వారిని సన్మానించారా? అనేది కీలక ప్రశ్న. కాదు..ఇవన్నీ కాదు.. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు ఉన్న ఏకైక ఆయుధం.. ఏదో ఒకరకంగా పార్టీలో ఉన్న అసంతృప్తిని పోగొట్టడమేనని కొందరు సీనియర్లు చెబుతున్నారు.
నిజానికి ఇప్పుడు మండలి రద్దు దశలో ఉంది. జగన్ ప్రభుత్వం చేసిన రద్దు తీర్మానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకే చేస్తే.. ఇక, రాష్ట్రంలో టీడీపీకి భారీ ఎత్తున దెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. ఈ క్రమంలో సెలక్ట్ కమిటీ అంటూ టీడీపీ హడావుడి చేసినా.. ఫలితం ఎక్కడా కనిపించలేదు. మరి ఈ నేపథ్యంలో అందునా అమరావతి రైతులకు కానీ, బాబు ఊహించుకున్న మూడు రాజధానులకు కేంద్రం బ్రేక్ వేస్తుందనుకున్న దానికి కానీ ఎలాంటి ఉపశమన మూ లేకపోవడం గమనార్హం. అయినా కూడా ఇలా స్వోత్కర్షలు, పరస్పర సత్కారాలు చూస్తే.. విస్మయం వ్యక్తమవుతోందని అంటున్నారు విశ్లేషకులు. మరి బాబుకు మాత్రం ఎలా అనిపిస్తోందో...!