ఇటివల జరిగిన ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సృష్టించిన సంచలనం తెలిసిందే. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను, ప్రస్తుతం దేశాన్ని అప్రతిహతంగా ఏలేస్తున్న బీజేపీకి చుక్కలు చూపిస్తూ భారీ విజయం సాధించింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ను ముచ్చటగా మూడోసారి అధికారంలో కూర్చోబెట్టారు ఢిల్లీ పౌరులు. గత ఐదేళ్లు సంగతేమో కానీ.. 2020 ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయంతో ఆ పార్టీ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. ఆప్ ను దేశంలో విస్తరించటం సాధ్యం కాదని గతంలో భావించిన కేజ్రీవాల్ కు ఈ విజయం మాత్రం ధైర్యాన్నిచ్చిందనే చెప్పాలి.
ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ఆప్ విజయం ప్రజలందరినీ ఆకర్షించింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఇంత సులువా అని రాజకీయ పార్టీలు.. నేనూ అలా సీఎం అయితే బాగుండును అని రాజకీయ నాయకులు అసూయపడే విజయం సాధించింది ఆప్. ఇది నిజమే అని నిరూపిస్తూ కేవలం 24 గంటల్లోనే ఆప్ పార్టీలో దేశం మొత్తం మీద 11లక్షల మంది చేరడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆప్ పార్టీ మొన్న 11వ తేదీన 9871010101 మొబైల్ నంబర్ను మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా చేసింది. ఈ నంబర్కు కేవలం ఓ మిస్డ్ కాల్ ఇస్తే ఆప్లో చేరినట్లే అని తెలిపింది.
దీంతో ఏకంగా 11 లక్షల మంది ఆ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఆప్ లో చేరామని నిరూపించారు. దీంతో పార్టీ నాయకత్వం కూడా తమ పార్టీలో ఒక్కరోజులోనే 11 లక్షల మంది చేరారని వెల్లడించింది. చూస్తుంటే భవిష్యత్తులో ఆప్ దేశం మొత్తం కూడా విస్తరించేలా ఉంది. వచ్చిన అవకాశాన్ని కేజ్రీవాల్ ఉపయోగించుకుంటే ఈసారి ఆప్ జాతీయ పార్టీ కావడం సులువే. కేజ్రీవాల్ సీఎంగా ఈనెల 16న ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.