ఇరిగేషన్ ప్రాజెక్ట్ల మీద సీయం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ జరిగిన ఈ సమీక్షకు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాజెక్ట్ల నిర్వహణ, నీటి సరఫరాపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కాళేశ్వరంలోని శ్రీ ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్, తరువాత ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మీ బ్యారేజ్ను పరిశీలించారు. ఆ తరువాత అధికారులతో మాట్లాడారు. లక్ష్మీ బ్యారేజ్ లో 14 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఈ సందర్భంగా నీటి వినయోగానికి సంబంధించి కేసీఆర్ అధికారులతో మాట్లాడారు.
రాజరాజేశ్వర బ్యారేజ్, ఎల్లంపల్లి, పార్వతి, లక్ష్మీ ఈ బ్యారేజ్లన్నీ కూడా నిండు కుండలని తలపిస్తున్న పరిస్థితి. ఎల్ఎండీ 24 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. దీని ద్వారా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు నీళ్లు తరలిస్తారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కూడా ఎల్ఎండీ ద్వారానే సాగు నీరు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఎండీలో నీటి నిల్వ తగ్గిన నేపథ్యంలో గత నాలుగు రోజుల నుంచి ఎల్లంపల్లి ద్వారా నందిని నుంచి గాయత్రి, గాయత్రి నుంచి రాజేశ్వరా బ్యారేజ్ 15759 క్యూసెక్కుల నీళ్లు తరలిస్తున్నారు.
అక్కడి నుంచి ఆ నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నారు. ఈ తరలింపు సంబంధించిన పనులను కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగానే అన్ని చెరువులు కుంటలను నింపాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. అందుకు అనుగుణంగా బ్యారేజ్లలో కూడా వీలైనంతా పూర్తి స్థాయిలో నీటి నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో రైతులకు నీటి సమస్య రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
అందుకు ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలేంటి అన్న విషయాలపై అధికారులతో చర్చిస్తున్నారు కేసీఆర్. అదే సమయంలో వీలైనంత త్వరగా చెక్ డ్యామ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రైతులకు మూడు కార్లకు నీళ్లు అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక్క నీటి చుక్క కూడా వృధా కాకుండా ఒడిసి పట్టుకోవటం ఎలా అనే అంశం మీదే కేసీఆర్ ప్రధానంగా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఈ మీటింగ్ తరువాత జరగబోయే మీడియా సమావేశంలో కేసీఆర్ అన్ని వివరాలు వెల్లడించనున్నారు.