చంద్రబాబు రాజకీయంగా పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎన్నో తప్పులు చేశారు. చివరకు తన పార్టీలోనే చాలా మంది నేతలను ఆయన పట్టించుకోలేదు. తన చుట్టూ ఉంటూ తనకు భజన చేసే వాళ్లను నెత్తిన పెట్టుకున్న బాబు చాలా మంది నేతలను చీడ పురుగుల్లా చూశారు. సీనియర్లుగా ఉన్న నేతలను పక్కన పెట్టి కాకాలు పట్టి.. బాకాలు ఊదే వాళ్లనే నెత్తినెట్టుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీ ఓడిపోవడంతో బాబు అసలు రంగును వాళ్లంతా బయట పెడుతున్నారు.
పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు పార్టీ కి షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు రేపో మాపో అయినా వైసీపీలో చేరిపోతారు. ఇక వంశీని బాబు ఐదేళ్ల పాటు ఎన్నో ముప్పు తిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. నియోజకవర్గ క్యాడర్ తో దాదాపు పదేళ్ళు గా వంశీ ఉన్నారు.
అయితే బాబు, లోకేష్ ఇద్దరూ వంశీ, గద్దె రామ్మోహన్, కేశినేని నాని లాంటి వాళ్లను కాకుండా దేవినేని ఉమాకే ప్రయార్టీ ఇచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ ఓడిపోవడం ఒక ఎత్తు అయితే ఉమా ఓడి వంశీ గెలిచారు. బాబు ఎవరిని అయితే పట్టించుకోరో వాళ్లే అయిన వంశీ, గద్దె రామ్మోహన్, కేశినేని నాని గెలిచారు. ఇప్పుడు వంశీ పార్టీ మారడంతో గన్నవరంలో బాబుకు బాధ ఏంటో తెలిసి వస్తోంది.
అక్కడ పార్టీని ముందుకు నడిపించే నాథుడే బాబుకు దొరకడం లేదు. గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ, కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ లాంటి పేర్లను పరిశీలిస్తున్నా.. ఎవ్వరూ ఇక్కడ బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఏదేమైనా వంశీని బాబు ఐదేళ్లలో పక్కన పెట్టినందుకు ఇప్పుడు తగిన శిక్షే అనుభవిస్తున్నారన్న గుసగుసలు టీడీపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి.