సెల్ఫీ ఎంత మాయ చేస్తుందో చెప్పక్కర్లేదు. సెల్ఫీ మోజులో పడితే... పక్కన ఏం జరుగుతున్నా సరే పెద్దగా పట్టించుకోరు. అది ఎవరైనా కావొచ్చు. సెలెబ్రిటీల విషయంలో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సెల్ఫీ మంత్రిగారికి పెద్ద తలనొప్పి తీసుకొచ్చి పెట్టింది. తెలంగాణకు చెందిన ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటీవలే ఓ పెళ్ళికి వెళ్లారు.
మంత్రిగారు పెళ్ళికి వస్తే కార్యకర్తలు చూస్తూ ఊరుకుంటారా చెప్పండి. ఆయనతో ఫోటోలు దిగాలని అనుకున్నారు. ఒకప్పుడు ఫోటో దిగాలి అంటే కెమెరా కావాలి. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంటె చాలు. హ్యాపీగా ఫోటోలు దిగొచ్చు. సెల్ఫీ తీసుకోవచ్చు. కార్యకర్తలు ఉత్సాహం చూపడంతో కాదనలేక సెల్ఫీ దిగేందుకు ముందుకు వచ్చారు మంత్రిగారు.
అలా సెల్ఫీ దిగే సమయంలో సడెన్ గా అయన చేతికి ఉన్న బంగారు కడియాన్ని ఎవరో దోచుకెళ్లిపోయారు. సెల్ఫీ సెక్షన్ పూర్తయ్యాక చూసుకుంటే చేతికి కడియం లేదు. దీంతో మంత్రిగారు షాక్ అయ్యారు. సెల్ఫీ బిజీలో పడి చేతికి ఉన్న కడియం ఎవరు తీస్తున్నారో పట్టించుకోలేదు. కడియం మిస్ కావడంతో మంత్రిగారు ఫైర్ అయ్యారు. అది తనకు కలిసివచ్చిన, సెంటిమెంట్ కడియం అని దాన్ని తప్పకుండా కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు.
మంత్రిగారు ఆదేశిస్తే పోలీసులు పాటించాలి కదా మరి. అందుకే దొంగలకు వేట మొదలుపెట్టారు. అక్కడ సెల్ఫీ దిగేందుకు పోటీపడిన కార్యకర్తలను పోలీసులు విచారిస్తున్నారు. కడియం తీసుకున్న వ్యక్తులు ఇచ్చేయాలని, వారిని ఏమి చేయమని అంటున్నారు. బంగారం కడియం. అందులోను మంత్రిగారి చేతికున్న కడియం దొరికిన లేదా దొంగిలించిన వ్యక్తి తిరిగి ఇచ్చేస్తాడా... లేదంటే దాన్ని భద్రంగా దాచుకుంటాడా చూడాలి. ఒకవేళ ఇచ్చేస్తే ఏమి అనకపోయినా, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఆ కడియం పట్టుకోవడం పోలీసులకు సవాల్ గా మారింది.