ఖమ్మం జిల్లాలో నిరుపేదలకు మూడు పూటలు అన్నం పెట్టాల్సిన ఆహార భద్రత పథకం అస్తవ్యస్తమవుతోంది. ఈ పాస్ విధానం ఉన్నా.. రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. రాంగ్ రూట్ లో లో చౌక బియ్యాన్ని, యథేచ్చగా బ్లాక్ మార్కెట్ కు రీసైక్లింగ్ చేస్తున్నారు. 

 

పేదల నోటి దగ్గరికి చేరాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటిపోతుంది. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కాకినాడ పోర్ట్  ద్వారా వేరే ప్రాంతాలకు తరలిపోతుంది. మధ్యలో ఎన్నో  చెక్ పోస్టులు,  అధికారులు విజిలెన్సు ఉన్నా దర్జాగా తరలించుకు పోతుంది రేషన్ మాఫియా. 

 

పశ్చిమ గోదావరి జిల్లాను అడ్డాగా చేసుకున్న అక్రమార్కులు, సరిహద్దు ప్రాంతాలైన చింతలపూడి, రాఘవపురం, గుడబట్లగూడెం గ్రామాల్లో డంపులు పెట్టి లారీలతో లోడులకు లోడులు తరలిస్తున్నారు వందల టన్నుల బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు తరలించి అక్కడ రీసైక్లింగ్ చేస్తున్నారు. దగ్గర్లోనే కాకినాడ పోర్టు ఉండటంతో ఆ దారిలో దేశంలోని ఇతర ప్రాంతాలకు సైతం పేదల బియ్యం తరలిపోతుంది.  

 

రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రేషన్ మాఫియా పని మరింత ఈజీ అయింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు ఈ రేషన్ దందాను వెనుక ఉండి నడిపిస్తున్నారు.‌ రేషన్ బియ్యాన్ని అంతా ఒకచోట చేర్చి,  తరువాత పెద్ద పెద్ద లోడులతో సరిహద్దు దాటిస్తున్నాయి రైస్ మిల్లర్ల యాజమాన్యాలు.  రేషన్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు.. రేషన్ బియ్యాన్ని ఎలాంటి తనిఖీలు చెయ్యకుండా సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  కేవలం లారీలోనే కాదు వ్యాన్ లు, ఆటో లోనూ మూటలకు మూటలు తరలిస్తున్నారు.  

 

ఈ పాస్ విధానంలో సరుకుల పంపిణీని కూడా డీలర్లు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కార్డుదారులు ఎక్కడైనా బియ్యాన్ని తీసుకుని సౌలభ్యాన్ని వక్రమార్గం పట్టిస్తున్నారు. ప్రతి నెల సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నా,  కొందరు డీలర్లు కుంటిసాకులతో లబ్ధిదారులను వెనక్కి పంపించేస్తున్నారు. చాలా చోట్ల రెండు నెలలకు ఒకసారి రేషన్ ఇస్తున్నారు. డీలర్ల తీరుతో చాలా పట్టణాల్లో లబ్ధిదారులు విసిగిపోతున్నారు. సరుకులు కూడా తీసుకోవడం లేదు .దాంతో వారి రేషన్ మాఫియా చేతికందుతుంది. రేషన్ డీలర్లు ఈపాస్ యంత్రాల టెక్నీషియన్లు,  ఎన్ఐటీ టెక్నీషియన్లు, వీఆర్వోలు,  ఫుడ్ ఇన్స్పెక్టర్ల అండతో దళారీలు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: