వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పించడంలో ముందుంటారు. ఏ మాత్రం టైం దొరికినా.. చంద్రబాబుపై ట్విటర్ వేదికగా సెటైర్లు పేలుస్తూ ఉంటారు. అయితే ఈయనకు మాత్రం టీడీపీ నుంచి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కౌంటర్ ఇస్తుంటారు. ఇలా వీరిద్దరి మధ్య ట్విటర్ వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక తాజాగా తెలుగు రాష్ట్రాల్లో జరిపిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో రూ.2000 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించినట్టు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన కూడా విడుదల చేసింది.
2020 సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మొత్తం 40 చోట్ల ఐటీ సోదాలు జరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మూడు ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. అధిక బిల్లులు, బోగస్ బిల్లులతో బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరిపిన రాకెట్ గుట్టు రట్టయిందని తెలిపారు. అయితే మరోవైపు ఏపీలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులపై జరిగిన ఐటీ దాడులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడిందని.. బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయని ఆయన అన్నారు.
అలాగే చంద్రబాబు నెట్ వర్క్ చూసి ముంబై కార్పొరేట్ సంస్థలన్నీ బిత్తరపోయాయట అని ఎద్దేవా చేశారు విజయ్ సాయిరెడ్డి. ఇక ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని మిర్శించారు ఈయన. చంద్రబాబు, ఆయన బానిస మీడియా ఇంతగా కుళ్లుకుంటున్నారంటే తిన్నది ఒంటబట్టడం లేదని అర్థమవుతోందని విజయసాయి ఎద్దేవా చేశారు. అదే విధంగా దోపిడీ రోజులు పోయాయని... నిజాయతీ, విశ్వసనీయతల విలువేమిటో ప్రజలు గ్రహించారని చెప్పారు. పచ్చ తెరల లోకం నుంచి బయటకు రావాలని అన్నారు. మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలాగని వ్యాఖ్యానించారు. ఇక ఏదేమైనా రెండు వేల కోట్లను కేవలం ఉల్లిపాయ పొరతో విజయ్సాయి రెడ్డి పోల్చడం ఆసక్తికర విషయం అని చెప్పాలి.