భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలి కమ్యూనికేషన్స్ ...ఈ కంపెనీలన్నింటికీ దిమ్మతిరిగి బొమ్మ కనబడే తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించిన మరుసటి రోజే...కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టెలి సంస్థలు సుమారు 1.5 లక్షల కోట్ల బాకీ చెల్లించకపోవడాన్ని సుప్రీం ఈ ఉదయం తప్పుపట్టింది. కంపెనీలకు సంబంధించిన బాకీల విషయంలో సుప్రీం నిర్ణయం అనంతరం తక్షణమే కేంద్రం స్పందించి రాత్రి 11.59 నిమిషాల్లోగా 92వేల కోట్ల బకాయిలను చెల్లించాలని టెలికాం సంస్థలకు టెలికాంశాఖ ఆదేశించి కంపెనీల మైండ్ బ్లాంక్ చేసేసింది.
టెలీకాం కంపెనీలైన భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికమ్యూనికేషన్స్ రూ. 1.5 లక్షల కోట్ల బాకీ ఉన్నాయి. ఈ మొత్తాన్ని వసూలు చేసుకునేందుకు కేంద్ర అష్టకష్టాలు పడుతోంది. ఈ విషయంలో కోర్టు మెట్లు ఎక్కింది. బాకీలను 90 రోజుల్లో చెల్లించాలని గత ఏడాది అక్టోబర్లో కోర్టు ఆదేశాలు ఇచ్చింది. జనవరి 24వ తేదీ వరకు ఆ ఆదేశాలు ముగిశాయి. కానీ టెలికాం కంపెనీలు బాకీ డబ్బులు చెల్లించలేదు. దీంతో కోర్టు సీరియస్ అయ్యింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అబ్దుల్ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్నది. ఈ సందర్భంగా ఎన్ని ఆదేశాలు ఇచ్చినా.. టెలికాం కంపెనీలు చలించడం లేదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకు ఏజీఆర్కు సంబంధించిన బాకీల నుంచి టెలికాం కంపెనీలు నయా పైసా కూడా చెల్లించలేదని, ఇంత అర్థంలేని వ్యవస్థను ఎవరు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని జస్టిస్ మిశ్రా పేర్కొన్నారు. ఈ దేశంలో చట్టానికి స్థానం లేదని, ఈ దేశంలో జీవించడం కన్నా.. మరో దేశానికి వెళ్లడం మేలు అని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. టెలికాం సంస్థల బాకీల గురించి తనను అడగాల్సిన అవసరం లేదని టెలికాంశాఖ అధికారి అటార్నీ జనరల్కు రాసిన లేఖను కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. టెలీ సంస్థల నుంచి డబ్బులు వసూల్ చేయరాదు అని శాఖాధికారి ఎలా ఆదేశాలు ఇస్తారని కోర్టు ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను ఓ డెస్క్ ఆఫీసర్ ఎలా అడ్డుకుంటారని జస్టిస్ మిశ్రా ప్రశ్నించారు. డబ్బు ఉందన్న అధికారంతో ఆ డెస్క్ ఆఫీసర్ ఇలా చేశారని, లేదంటే కోర్టు ఆదేశాలను ఎలా అడ్డుకుంటారని మిశ్రా అన్నారు. ఇలా సర్వోన్నత న్యాయస్థానంలో ఆగ్రహంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో...ఇవాళ రాత్రి 11.59 నిమిషాల్లోగా 92వేల కోట్ల బకాయిలను చెల్లించాలని టెలికాం సంస్థలకు టెలికాంశాఖ ఆదేశించింది.