గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కృష్ణా జిల్లా టిడిపిలో రాజకీయం ఒక్కసారిగా రివర్సయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో జిల్లా టిడిపిలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్న వారందరినీ కాదని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే గత ఏడాది ఎన్నికల్లో జిల్లాలో ఉమా వైరి వర్గం నేతలు అయిన కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విజయం సాధించగా జిల్లాలో మిగిలిన నేతలు అందరూ చిత్తుగా ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లో ఓడిపోయాక ఎంపీ కేశినేని నాని బహిరంగంగానే ఉమాపై ధ్వజమెత్తుతూ వచ్చారు. చివరకు ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న కు ఎంపీ నాని కి సోషల్ మీడియాలో పెద్ద వార్ నడిచింది. పార్లమెంట్లో పార్టీ వాణిని ... ఏపీ సమస్యలను ప్రస్తావిస్తూ హైలెట్ అవుతున్న ఎంపీ నాని ఇప్పుడు దేవినేని ఉమాను బాగా టెన్షన్ పెడుతున్నారట. మైలవరంలోఉమా ను ఓడించిన వసంత కృష్ణ ప్రసాద్ నాని ఇప్పుడు చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అంతేకాకుండా ఎంపీ నాని తన నిధుల ద్వారా వసంత కృష్ణ ప్రసాద్ కోరిక మేరకు మైలవరం నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు... నియోజకవర్గ అభివృద్ధికి తన ఎంపీ నిధుల ద్వారా 50 లక్షలు కూడా మంజూరు చేశారు.
సహజంగానే ఉమాకు వీరిద్దరు బద్ధ శత్రువులుగా ఉన్నారు. వసంతకు ఉమాకు అస్సలు పడదు. అలాంటి వసంతతో తన పార్టీ ఎంపీ నాని క్లోజ్ గా మూవ్ అవ్వడంతో పాటు ఆయన కోరిక మేరకు ఓ గ్రామం దత్తత తీసుకోవడం.. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం ఉమాకు ఎంత మాత్రం నచ్చడం లేదట. దీంతో పాటు ఉమా జిల్లాలో తనను ఎవరైనా డామినేట్ చేస్తే సహించలేరు. ఇక ఇప్పుడు నాని ఇటు జిల్లా నుంచి అటు పార్లమెంటు వరకు దూసుకు పోతుండడంతో పాటు బాబుకు మరింత దగ్గరవ్వడం... ఇటు తన రాజకీయ ప్రత్యర్థి వసంతతో క్లోజ్గా ఉండడం ఉమాకు బాగా టెన్షన్ గా మారిందట.