ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. సీఎం జగన్ అమిత్ షాతో ఏపీకి సంబంధించిన కీలక అంశాల గురించి ప్రధానంగా చర్చ జరిపారు. దాదాపు 30 నిమిషాల పాటు జగన్, అమిత్ షా మధ్య భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, మండలి రద్దు , దిశ బిల్లుకు చట్టబద్ధత, రాజధాని, పోలవరం సమస్యల గురించి జగన్ అమిత్ షాతో చర్చించారు. 
 
పోలవరం నిర్మాణం వేగంగా జరుగుతోందని 2021 సంవత్సరం నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని 838 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా చేశామని జగన్ అమిత్ షా కు తెలిపారు. కేంద్రం నుండి రాష్ట్రానికి 3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని జగన్ అమిత్ షాకు చెప్పగా అమిత్ షా కేంద్ర జల వనరుల శాఖకు ఆదేశాలు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. సీఎం జగన్ గడచిన మూడు సంవత్సరాల నుండి వెనుకబడ్డ జిల్లాలకు 1050 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయని గత మూడు సంవత్సరాల నుండి ఎలాంటి నిధులు రాలేదని గుర్తు చేశారు. 
 
సీఎం జగన్ ప్రధానంగా శాసన మండలి రద్దు తీర్మానానికి కేంద్రం ఆమోదం గురించి, హైకోర్టును కర్నూలుకు తరలించడానికి తగిన ఆదేశాలను ఇవ్వాలని అమిత్ షాను కోరారు. అమిత్ షా ఈ రెండింటికీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. సీఎం జగన్ అమిత్ షాకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్థిక సంఘం సిఫార్సులతో పని లేదని 15వ ఆర్థిక సంఘం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని  చెప్పుకొచ్చారు. 
 
సీఎం జగన్ అమిత్ షాకు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్యను తగ్గించటం కోసం కఠిన చర్యలు చేపట్టామని ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, ప్రత్యేక కోర్టులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం, ఒన్ స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతి కొరకు కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం పోర్టు కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్, విశాఖ - చెన్నై కారిడార్ కోసం తగిన ఆర్థిక సహాయం చేయాలని జగన్  అమిత్ షాను కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: