వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పాదయాత్రలో ప్రకటించిన అన్ని ఒక్కో పథకాన్ని ఆచరణలోకి తీసుకువస్తూ తమది చేతల ప్రభుత్వమే గానీ మాటల ప్రభుత్వం కాదని నిరూపిస్తున్నాడు. తాజాగా మరో భారీ కానుకను ప్రకటించాడు జగన్‌. పేద కుటుంబంలోని అమ్మాయిలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న పెళ్లి కానుకల కోసం నిధులు విడుదల చేసింది. త్వరలోనే ఈ డబ్బు వారి అకౌంట్లలో జమకానున్నాయి.

 

ఫీల్డ్‌ వెరిఫికేషన్‌ తర్వాత అర్హత సాధించిన వారికి డబ్బులు విడుదలవుతాయని అధికారులు వెల్లడించారు. వైఎస్సార్‌ పెళ్లి కానుకగా అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. పెంచిన పెళ్లి కానుకను శ్రీరామ నవమి నుంచి అమలు చేయనుంది. భవిష్యత్తులో ఈ సాయాన్ని మరింత పెంచేందుకు జగన్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇఛ్చినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్ని కూడా పెంచారు.

 

ఇన్నాళ్లు ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుకగా అందజేసేవారు. ఇక మీదట వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద వారందరికీ లక్ష రూపాయలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేలను, రూ.1.20 లక్షలు చేశారు. బీసీ యువతులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు.. కులాంతర వివాహాలు చేసుకొనేవారికి రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచుతూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు.. దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు ప్రోత్సాహకాలను పెంచారు.

 

అలాగే భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను జగన్ సర్కార్ భారీగా పెంచింది. ఇన్నాళ్లు రూ.20 వేలగా ఉన్న కానుకను ఒక్కసారిగా రూ.లక్షకు పెంచింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ, కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారింట్లో ఆడపడుచులకు పెళ్లి కానుక పథకాన్ని అమలు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉందంటున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: