కేసీఆర్ను ఎదుర్కొనే ఒకేఒక్కడుగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు పొందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి రాజకీయ ప్రయాణం 2018 ఎన్నికల తర్వాత పడిలేచిన కెరటం మాదిరిగా సాగింది. కొడంగల్లో ఓటమి వెక్కిరించినా ఆయన్ను భాగ్యనగరవాసులు గుండెలకు హత్తుకుని మరీ పార్లమెంటు ఎన్నికల్లో విజయం కట్టబెట్టారు. తన ప్రసంగాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అభిమానులను రేవంత్రెడ్డి సంపాదించుకున్నారు. కేసీఆర్ను ఢీకొట్టే సత్తా ఉన్న ఒకే ఒక్క కాంగ్రెస్ నేతగా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు బలంగా నమ్మారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి ఆయనపై పార్టీలో అంచనాలు పెంపొందుతూ వచ్చాయి.
ఎన్నికల సమయంలో ఆయన వర్గీయులకు టికెట్లు ఇప్పించుకోవడంలో కొంత సఫలీకృతులయ్యారు. అయితే ఆయన దాదాపు 30 మంది వరకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు ఇలా అనేక మంది కట్టడి చేశారని సమాచారం. టికెట్లు ఇప్పించుకున్న వారిలో సీతక్క, హరిప్రియనాయక్ లాంటి వారిని గెలిపించుకోగలిగారు.
ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ప్రతీ అభ్యర్థి రేవంత్ను తమ నియోజకవర్గంలో ఎన్నికల పర్యటనకు ఆహ్వానించడం విశేషం. ఆయన చరిష్మా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహారణ చాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే కొడంగల్లో ఓటమిని మాత్రం ఆయన చాలా రోజుల వరకు జీర్ణించుకోలేకపోయారు. అందివచ్చిన పార్లమెంటు ఎన్నికలను సద్వినియోగం చేసుకున్న ఆయన మల్కాజిగిరిలో అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఆయన డూ ఆర్ డై సిచువేషన్ లో రేవంత్ రెడ్డి తన సత్తా ఏంటో చాటాడు.
ఎంపీ నియోజకవర్గంలో అత్యధికులు సెటిలర్లే కావడం ఆయనకు బాగా కలిసొచ్చింది. దానికి తోడుగా అనేకమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలకు ఇక్కడి వారితో సత్సంబంధాలు ఉండడంతో వారు మద్దతు పలికారు. పైగా కేసీఆర్ వ్యతిరేకులంతా కూడా రేవంత్ రెడ్డి అంటే ఇష్టపడ్డారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ జోరు ముందు కాంగ్రెస్ నిలవలేదు. ఇక ఉత్తమ్ను టీ పీసీసీ నుంచి తప్పించాలని చూస్తున్నారు. ఏదేమైనా తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్ హీరోగా రేవంత్రెడ్డిని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. త్వరలో టీపీసీసీ అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.