ఏపీ సీఎం జగన్ పంతం నెరవేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా శనివారం డిల్లీలో చోటు చేసుకున్న పరిణామాలను విశ్లేషిస్తే.. జగన్ సూచనలకు కేంద్రంలోని ప్రధాని మోడీ, అమిత్ షాలు పచ్చ జెండా ఊపినట్టే కనిపిస్తోంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం కోరలు కత్తిరించాలనే పట్టుదలతో ఉన్న జగన్.. తనకు, తన పార్టీకి మరో ఏడాదిలో భారీ లబ్ధి ఒనగూరుతుందని తెలిసి కూడా శాసన మండలిని రద్దు చేసేశారు. ప్రజాబలంతో ఏర్పాటైన శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని నిబందనలకు విరుద్ధంగా మండలి తిరస్కరించడంపై జగన్ ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలోనే మండలిలో మందబలం ఉన్న టీడీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ఆయన మండలిని రాత్రికి రాత్రి రద్దు చేస్తూ.. శాసన సభలో తీర్మానం చేశారు. ఆ వెంటనే కేంద్రానికి పంపారు. అయితే, జగన్ చేసిన తీర్మానాన్ని టీడీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. ఆ.. ఇప్పుడే మండలి రద్దవదు. కేంద్రం సహకరిస్తేనే కదా.. అయినా.. మండలి గురించి కేంద్రం ఇప్పట్లో దృష్టి పెట్టదు. సో.. రెండు మూడేళ్ల సమయం పడుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
అయితే, జగన్ మాత్రం టీడీపీకి బుద్ధి చెప్పాలనే తన నిర్ణయాన్ని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మండలిరద్దు ముఖ్యాంశంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కలిశారు. ప్రదాని మోడీకి వివరించారు. అమిత్షాకు వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపు గుర్రం ఎక్కి.. అఖండ మెజారిటీని సొంతం చేసుకున్న తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో టీడీపీ అడ్డుకున్న వైనాన్ని వివరించారు. వాస్తవానికి బీజేపీ సర్కారు కూడా అఖండ మెజారిటీతో విజయం సాధించి కేంద్రంలో చక్రం తిప్పుతోంది. అయితే, రాజ్యసభలో అనేక కష్టాలు ఎదుర్కొంటోంది. అక్కడ బలం లేక పోవడంతో అనేక బిల్లులు పెండింగులో పడుతున్నాయి.
ఈ సమస్య తెలిసి ఉండడంతో పాటు.. టీడీపీపై బీజేపీకి ఇప్పటికే తీవ్ర వ్యతిరేక భావం ఉన్న నేపథ్యం మరీ ముఖ్యంగా మోడీ హఠావో అని చంద్రబాబు ఇచ్చిన నినాదం ఇంకా ఢిల్లీ పెద్దల చెవుల్లో వినిపిస్తున్న నేపథ్యంలో జగన్కు సహకరిచేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే మోడీని కలిసినప్పుడు .. స్వయంగా మోడీనే అమిత్ షాను కలవాలని జగన్కు సూచించారు. ఇక, షా ను కలిసినప్పుడు వెంటనే ఆయన న్యాయ శాఖ మంత్రిని కలిసేలా మార్గం సుగమం చేశారు(నిజానికి న్యాయ శాఖ మంత్రితో కలవాలని జగన్ అనుకోలేదు).
ఆ వెంటనే శనివారం ఉదయం జగన్ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ప్రసాద్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మండలి రద్దు గురించిన ప్రస్థావన తీసుకువచ్చారు. ఈ పరిణామాన్ని గమనిస్తున్న ఢిల్లీ పెద్దలు గతంలో కేంద్ర మంత్రులను కలవాలని జగన్ అనుకున్నా .. షా అడ్డుకున్నారని, కానీ, ఇప్పుడు ఆయనే వారి వద్దకుజగన్ను పంపించారని. సో.. మండలి రద్దు త్వరలోనే కానుందని చెబుతున్నారు. అంటే కేవలం ఓ నెల రోజుల్లోనే మండలి రద్దు అయిపోవడం తథ్యమని తెలుస్తోంది. ఇదే జరిగితే.. జగన్ పంతంనెరవేరడం ఖాయమని అంటున్నారు.