కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అధికారుల పై మండిపడ్డారు. అయితే.. జేబీఎస్ - ఎంజీబీఎస్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే మెట్రో ప్రాజెక్టు నిర్మించారా అని అధికారులను నిలదీశారు. కేంద్రం ఇవ్వాల్సిన రూ.250 కోట్ల నిధుల గురించి ఇక ఢిల్లీకి రావొద్దని హెచ్చరించారు. 

 

 

కాగా., శనివారం హైదరాబాద్ లో ఎల్ అండ్ టీ మెట్రో అధికారులతో దిల్ కుషా అతిథి గృహంలో కిషన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్‌ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ ఎంపీ నాయుడు, ఎల్‌టీఎంఆర్‌హెల్‌ఎల్ ఏకే షైనీ, హెచ్‌ఎంఎల్‌ఆర్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్ మోహన్, జీఎం రాజేశ్వర్ తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఎల్ అండ్ టీ సంస్థకు ఇక భవనాలు, అనుమతులు ఏవీ ఇవ్వమని కిషన్ రెడ్డి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఇక ఏమీ అడగొద్దని స్పష్టం చేశారు. ‘మెట్రో రైలు ప్రారంభం అనేది ఎల్ అండ్ టీకి ఇంటి పనో, వ్యక్తిగత వ్యవహారమో కాదు కదా.. పిలవకుండా ఎలా చేస్తారు’ అని అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే తనకు ఆహ్వానం పంపలేదని అసహనం వ్యక్తం చేశారు.

 

 

 

హైదరాబాద్‌ నగరానికి మణిహారంగా అభివర్ణిస్తున్న మెట్రో రైలులో కీలకమైన జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిబ్రవరి 7న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రొటోకాల్ ప్రకారం ఈ కార్యక్రమానికి సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆహ్వానించాల్సి ఉండగా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. 

 

 

 

దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మెట్రో రైలు ప్రారంభించిన రోజే కిషన్ రెడ్డి కార్యాలయ అధికారులు మెట్రో అధికారులను ప్రశ్నించినట్లు సమాచారం. మెట్రో అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి కిషన్ రెడ్డి పలువురు బీజేపీ నేతలు జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: