హైదరాబాద్ సత్తాను మరోమారు చాటి చెప్పేందుకు...తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఇప్పటికే పెట్టుబడుల విషయంలో తన సత్తా చాటుకుంటున్న తెలంగాణ ఇదే దూకుడు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రతి సంవత్సరం జరిగే బయో ఏషియా సదస్సుకి ఈసారి మరోసారి ఆతిథ్యమివ్వనుంది.ఈసారి జరుగనున్న 17వ బయో ఏషియా సదస్సు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరగనున్నది. “ టుడే ఫర్ టుమారో” అని నినాదంతో ఈ సదస్సు ఈ నెల 17, 18, 19 తేదీల్లో జరుగుతుంది. ఈ సదస్సుపై తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ప్రపంచంలోనిలైఫ్ సైన్సెస్ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకొని, పెట్టుబడులు పెట్టి, అవసరమైన చర్యలను విధానాలను రూపకల్పన చేసేందుకు ఈ మూడు రోజులపాటు ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాల నుంచి సుమారు 2000 మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సమావేశాల్లో భాగస్వాములు కానున్నయి. ఈ సంవత్సరం స్విజర్లాండ్ భాగస్వామి దేశంగా ఉన్నది. అస్సాం, కేరళ, ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామి రాష్ట్రాలు ఉన్నాయి.
గత దశాబ్ద కాలంగాభారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉన్న అవకాశాల పరిశీలన, ఇక్కడ పెట్టుబడుల కోసం ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్, ఫార్మా పారిశ్రామిక వర్గాలతోపాటు పరిశోధకులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో బయో ఏషియా కీలకపాత్ర వహిస్తూ వస్తున్నది. హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు రావడంలో బయో ఏషియా కీలకపాత్ర వహిస్తూ వస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయో ఏసియా సదస్సు సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి పరిశ్రమల మౌలిక వసతుల ప్రమాణాలను, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు బయో ఏషియా ఒక చక్కని అవకాశంగా ఉందని తెలిపారు. ఇక్కడి బయో మరియు లైఫ్ సైన్సెస్ ఈకోసిస్టమ్ గురించి నేరుగా తెలుసుకోవడానికి ఈ సదస్సు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తున్నదని అన్నారు. ఈ సదస్సును విజయవంతం చేసి హైదరాబాద్ లోమరిన్ని లైఫ్ సైన్సెస్ ఫార్మా పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
గత 17 సంవత్సరాలుగా నిర్వహించిన సదస్సుల్లో భాగంగా వందలకొద్ది ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక కంపెనీలకు గ్లోబల్ ఇన్వెస్టర్లను పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరం కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ప్రపంచ స్థాయి కంపెనీల సీనియర్ ప్రతినిధులు, పరిశోధకులు మూడు రోజులపాటు జరిగే వివిధ సమావేశాల్లో ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు.