అమ్మా నేను స్కూల్కు వెళ్లి వస్తా, అలాగే బాబు, నీ టిఫిన్ బాక్స్లో స్నాక్స్ పెట్టాను. ఇంట్రవెల్ లో అవి తిను, మధ్యాహ్నాం లంచ్ తిని, చక్కగా చదువుకో నాన్నా, సాయంత్రం డాడి నీకు ఏమైన తెస్తాడు, జాగ్రత్త అని అన్ని విషయాలు చెప్పి స్కూల్కు పంపించిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చాక ఆ రోజు స్కూల్లో చెప్పిన సంఘటనలు అన్ని పూసగుచ్చినట్లుగా చెబుతుంటే తల్లిదండ్రుల మనస్సుకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది...
ఇలా ఏ తల్లి దండ్రులైన వారి పిల్లలను స్కూల్కు పంపించి, లక్షలు పోసి, చదువు కొంటున్నారు.. ఇలాంటి సమయాల్లో కొన్ని స్కూళ్ల నిర్లక్ష్యం వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.. ఎవరు చేసిన పాపమో తెలియదు కాని ఒక స్కూల్ వ్యాన్ దహానం అయ్యి నలుగురు పిల్లలు అగ్నికి ఆహుతి అయిన ఘటన పంజాబ్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు తెలుసుకుంటే..
స్థానిక నగరంలోని సిమ్రన్ పబ్లిక్ స్కూల్కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ 12మంది చిన్నారుల్ని వారి ఇంటి దగ్గర డ్రాప్ చేసేందుకు తీసుకెళ్తున్న సమయంలో సాంగ్రూర్లో సిద్ సమధన్ రోడ్డుకు సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా వ్యాన్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని సమీపంలో ఉన్న పొలాల్లో పనిచేస్తున్న వారు ఇది గమనించి వెంటనే వ్యాన్ దగ్గరకు పరుగు పరుగున వచ్చి చిన్నారుల్ని బయటకు తీశారు.
కాని అప్పటికే జరగవలసిన ఘోరం జరిగి నలుగురు పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఇకపోతే చనిపోయిన చిన్నారులంతా ఐదేళ్లలోపు వారు కావడంతో... వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి కెఫ్టెన్ అమరీందర్ సింగ్ స్పందించి, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు...
అంతా జరిగాక కన్న వారికి కడుపుకోత మిగిలాక ఎన్ని చేసిన ప్రయోజనం ఉండదు. ఒక పంజాబ్ అనే కాదు, దాదాపుగా అన్ని స్కూళ్లలో నిర్లక్ష్యం అనేది కొనసాగుతుంది.. ఫీజు వసూళ్ల దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉండే యజమాన్యం పిల్ల విషయంలో మాత్రం పట్టనట్లుగా ఉండటం బాధాకర విషయం..