అత్యంత సుందరంగానే కాకుండా ప్రత్యేకమైన కొలతలతో రూపొందించిన ముఖాకృతితో భూమ్మీద ఉన్న విగ్రహాలన్నింటిలోను అతి పెద్ద ముఖం కలిగిన విగ్రహంగా కోయంబత్తూర్ సమీపంలోని వెల్లియంగిరి కొండల సమీపంలో 112 అడుగుల ఎత్తైన ఆదియోగి(శివుడు) విగ్రహాన్ని ప్రతిష్టింపచేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగ్గీవాసుదేవ్పై ఊహించని వివాదం తెరమీదకు వచ్చింది. ఈ ప్రముఖ ఆధ్యాత్మిక గురువుపై మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్మ్యాన్(జల వనరుల పరిరక్షకుడు)గా ప్రసిద్ధి చెందిన రాజేంద్రసింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. జగ్గీ వాసుదేవ్ తనను తాను సద్గురువుగా చెప్పుకోవచ్చని, వాస్తవానికి ఆయన దొంగబాబా అని విమర్శించారు.
జగ్గీ వాసుదేవ్ వ్యక్తిగత జీవితం, నదుల పునరుజ్జీవనానికి మిస్డ్కాల్ ఇవ్వండి అంటూ జగ్గీ వాసుదేవ్ గతంలో చేసిన ప్రచారంపై రాజేంద్రసింగ్ నిప్పులు చెరిగారు. జగ్గీ వాసుదేవ్ తన భార్యను కూడా హత్యచేశారని ఆరోపించారు. ‘మిస్డ్కాల్స్తో నదులు పునరుజ్జీవనం అవుతాయా?ఎంత మోసం ఇది’ అని ఆయన ప్రశ్నించారు. వినోభాభావే భూదాన ఉద్యమం కింద కోయంబత్తూర్లో రైతులకు పంపిణీ చేసిన భూములను జగ్గీ వాసుదేవ్ కబ్జా చేశారని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తున్నదని తెలిపారు. ఈ ఆరోపణలు కలకలం రేకెత్తించాయి. రాజేంద్రసింగ్ ఆరోపణలను ఈశా ఫౌండేషన్ ఖండించింది. ఆ ఆరోపణలు అవాస్తవం, నిరాధారమని తెలిపింది. మతి స్థిమితం లేకపోవడం వల్ల లేదా ఈ విధంగా పేరుపొందాలనే నీచ ఆలోచన వల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని మండిపడింది.
కాగా, నీటి హక్కు చట్టంపై జరుగబోయే సెమినార్లో పాల్గొనేందుకు భోపాల్కు చేరుకున్న రాజేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుత ఈ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న కంప్యూటర్ బాబాపైనా ఆయన విమర్శలు గుప్పించారు. అధికారం కోసం తహతహలాడేవారు నదులను రక్షించలేరని, ఉద్యమంలో ప్రజలను భాగస్వాములను చేస్తేనే అది సాధ్యమవుతుందని రాజేంద్ర సింగ్ అన్నారు.