అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటించనున్నారు. ఇటీవల మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియా వస్తానంటూ మాట ఇచ్చిన ట్రంప్ ఆ మేరకు ఫిబ్రవరి 24న రానున్నాడు. వాణిజ్య ఒప్పందంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు భారత్ కు రానున్న నేపథ్యంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేస్తోంది ప్రభుత్వం. ఈ పర్యటనలో భాగంగా ట్రంప్ తన సతీమణి మెలానియాతో కలిసి గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలిసి ఈ నెల 24న భారీ రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ రోడ్ షో దాదాపు 60 లక్షల మంది ప్రజలు పాల్గొంటారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్ షో అనంతరం సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు. ఆ తరువాత మొతేరా ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తోన్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ స్టేడియంను ట్రంప్ తో కలిసి ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. ఈ ప్రాంతంలో కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో స్టేడియం ప్రాంతంలో కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
దాదాపు 10,000 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తును పర్యవేక్షించనున్నారు. వీళ్లంత 25 మంది ఐపీఎస్ ల ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించనున్నారు. ప్రధాన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 200 మంది ఇన్స్పెక్టర్లు, 800 మంది సబ్ ఇన్స్పెక్టర్లు విధుల్లో పాల్గొంటారని డీసీపీ విజయ్ పటేల్ వెల్లడించారు. మన దేశ భద్రతా సిబ్బంది తో పాటు అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కు చెందిన భద్రతా దళాలు కూడా రక్షణ బాధ్యతల్లో పాలు పంచుకుంటున్నాయి.