ఆదర్శం! ఈ మాట మనం తరచుగా వింటూ ఉంటాం. నాకు వాళ్లు ఆదర్శమండి, వీళ్లు ఆదర్శమండి అని చెప్పుకొనే వారు చాలా మంది కనిపిస్తారు. కానీ, ఆ ఆదర్శం చేతల్లో మాత్రం కనిపించదు. పేరుకు మాత్ర మే ఆదర్శం గురించి మాట్లాడేవారులా కాకుండా తనకంటూ .. పెట్టుకున్న ఆదర్శ మార్గంలో పయనిస్తూ.. నలుగురికీ ఆదర్శంగా మారిన వ్యక్తుల్లో యువ కిశోరంగా నిలిచారు.. సరిపల్లి కోటిరెడ్డి. సాధారణ ప్రజలకు పెద్దగా పరిచయం లేకపోయినా.. కంప్యూటర్ ప్రపంచానికి మాత్రం ఆయన చిరపరిచితులే కావడం గమనార్హం.
అనేక దేశాల్లో ఈ రోజు ఆయన కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. స్వదేశంలోనూ ఆయన యువ ఎంటర్ ప్రెన్యూర్గా రికార్డుల మోత మోగిస్తున్నారు. అంతేకాదు, తానే ఒక తేజమై.. వందల మంది జీవతాల్లో వెలుగు పూలు పూయిస్తున్నారు. మరి ఆయన నడిచిన బాట.. ఆయన ఎంచుకున్న బాట అసామాన్యం. ఏమీ తెలియని స్థాయి నుంచి కోట్లకు ఎదిగేలా టెక్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునేలా ఆయన వేసిన అడుగులు అనితర సాధ్యం. అసామాన్యం. నిజానికి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కృషీవలులుగా మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, అంబానీ గ్రూపు సంస్థలవ్యవస్థాపకుడు ధీరూభాయి అంబానీలే ఆయనకు ఆదర్శం.
ఆదర్శం అని కోటిరెడ్డి చెప్పరు. చెప్పుకోరు.. వారు చూపిన బాటలో వారు నడిచిన దారిలో నడిచారు. మట్టి నుంచి మాణిక్యాలను వెలికితీసేలా తనను తాను నిరూపించుకున్నారు. కేవలం వెయ్యి రూపాయలతో కంప్యూటర్ ప్రాధమిక విద్యను నేర్చుకున్న ఆయన ఇంతింతై.. అన్న మాటలను అక్షరసత్యం చేశారు. పదో తరగతి కుర్రాడు ప్రపంచాన్ని ఏలే టెక్ దిగ్గజమై,.. మేధావులను సైతం అబ్బురపరుస్తున్నాడు. నేడు ఆయన ప్రపంచం 14 కంపెనీలతో రు. 750 కోట్ల వార్షిక టర్నోవర్కు ఎదిగే రేంజ్కు చేరింది. ఆయన వేసిన అడుగులు అసామాన్యం.. ఆయన నేటి ఆదర్శం. రేపటికి చరిత్ర..!!