ఒక చోట కూర్చుని పనిచేయడం, చేసిన పనినే చేయడం సర్వసాధారణంగా మనకు కనిపించే విషయం. అయితే, ఇలాంటి వాటికి చాలా మంది కడుదూరంలో ఉంటారు. అలాంటి వారిలో కొందరు మాత్రమే సం చలనాలకు కేంద్రంగా మారతారు. ఇలాంటి సంచలనమే.. కోటిరెడ్డి సరిపల్లి. 200 పైచిలుకు దేశాల్లో 700 కోట్ల పైచిలుకు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఏర్పడిన కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ అధినేత కోటిరెడ్డి సరిపల్లి ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. ఆయనదంతా వినూత్న శైలి. మనం ఎక్కడ నుంచి వచ్చాం.. అన్నది కాదు.,. మనం నేటి కాలంతో అనుసంధానం అయి.. రేపటి రోజును నిర్దేశించే స్థాయికి చేరుకున్నామా ? లేదా? అన్నదే ముఖ్యమని అంటారు ఆయన.
ఆలోచనలకు నిత్యం పదును పెడుతూ.. సాంకేతిక యుగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు కోటిరెడ్డి. ఉద్యోగిగా ప్రారంభమైన కోటిరెడ్డి ప్రస్థానం నేడు ఉద్యోగాలు ఇచ్చేస్థాయిలోను, ప్రభుత్వాలకు, ప్రజలకు సేవ చేసే స్థాయిలోను ఉండడం గమనార్హం. మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమైంది ? అంటే..కేవలం ఆలోచనలకు పదును పెట్టడం వల్ల. ఆవిష్కరణలకు ప్రాణం పోయడం వల్లేనని చెప్పాలి. ఏదో ఒకచోట నిలిచిపోయి జీవితాన్ని ముగించేయాలని కోటిరెడ్డి ఆశించలేదు.
అనంత కాలగమనంలో ఈ అద్భుతమైన జీవితాన్ని ఒక అవకాశంగా మలుచుకుని పుట్టిన ఊరు, రాష్ట్రం దేశంతోపాటు ఈ ప్రపంచానికి కూడా చేయాల్సినంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదిశగానే కోటిరెడ్డి అడుగులు వేశారు. కేవలం 750 రూపాయల ఉద్యోగిగా ఉన్నప్పటి నుంచి 750 కోట్ల టర్నోవర్ కు అతి తక్కువ సమయంలో చేరుకున్నారంటే.. ఎంత కృషి, ఎన్ని ఆవిష్కరణలు కోటిరెడ్డి జీవితంలో ముడిపడి ఉంటాయో చెప్పొచ్చు. నేడు ఆయన వ్యాపార సామ్రాజ్యం ఏకంగా మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది.
సమస్య ఉన్న చోట నుంచి పక్కకు తప్పుకోవడం పెద్ద విషయంకాదు. కానీ, ఆ సమస్యను ఎదుర్కొని నిలిచి .. సమస్యను పరిష్కరించడమే కీలకమైన విషయం. దీనినిసాధించారు కోటిరెడ్డి. ఆరోగ్య సమస్యలు సహా ఆర్థిక సమస్యలతో కుంగిపోతున్న ప్రపంచానికి అనేకరూపాల్లో సాంకేతిక పరిష్కార ఆవిష్కరణలు రూపొందించి ప్రజలకు అందించారు. తద్వారా ఓ తెలుగు తేజం ఈ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకుందనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు.