తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు ఈ సారి వినూత్నంగా జరుపుకుంటున్నారు. 66వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న ముఖ్యమంత్రికి మొక్కల పండుగతో విషెష్ చెప్పడానికి సిద్ధమైంది గులాబీ దళం. మొక్కలు నాటుదాం... తెలంగాణను ఆకుపచ్చగా మార్చుకుందాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ప్రభుత్వ శాఖలు, ఉద్యోగసంఘాలు అదే పనిలో నిమగ్నమయ్యాయి.
సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ ఊపందుకుంది. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం.. దేశవ్యాప్తంగా ప్రముఖుల్ని భాగస్వామ్యం చేసింది. సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు.. భాష, సరిహద్దులు చెరిపేసి పాల్గొనడంతో అది విశ్వవ్యాప్తం అయింది.
కేసీఆర్ బర్త్ డేకి హైదరాబాద్లో ఈ సారి సందడే సందడి. మెట్రో పిల్లర్లపై ఎటూ చూసినా కేసిఆర్ బర్త్ డే విషెష్ ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. నగరం అంతా హోర్డింగ్లకు కొదువలేదు. అందరి దృష్టిని ఆకర్షించేందుకు ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్స్ తయారుచేస్తున్నారు. వి లవ్ కేసియార్ పేరుతో కొన్ని కార్యక్రమాలు చేస్తుండగా -పెయింటింగ్స్ , చిత్రకళా ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. జంటనగరాల్లోని కవలలందరినీ ఒకే చోటుకు చేర్చింది మరో సంస్థ. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈసారి కేసీఆర్ బర్త్ డేకు రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గజ్వేల్లో 2600 మంది మొక్కలు పట్టుకుని 66వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేసియార్ రూపంలో నిలబడ్డారు. ఇక విదేశాల్లో కూడా టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాయి.
మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సారి పుట్టిన రోజు వేడుకల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజ సేవకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిభిరాలు లాంటివి ఏర్పాటు చేయాలని ఇప్పటి ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఇంకేముందీ కేసీఆర్ 66వ పుట్టిన రోజున సామాజిక కార్యక్రమాలతో తెలంగాణ విలసిల్లనుంది.