కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఊహించినట్లుగానే ఆస‌క్తిక‌రంగా సాగింది. న‌గ‌ర ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర ఆర్థిక‌మంత్రి మొద‌టి సెషన్లో వాణిజ్య, పరిశ్రమ, పెట్టుబడి బ్యాంకర్, రైతు సంస్థల ప్రతినిధులతో, రెండవ సెషన్లో ఆర్థికవేత్తలు, టాక్స్ ప్రాక్టీషనర్స్ , అకాడెమియా ( విద్యా రంగ నిపుణులు) మరియు విధాన రూపకర్తలతో వివిధ బడ్జెట్ అంశాలపై సమాలోచనలు జరిపారు. అనంత‌రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని  నిర్మలా సీతారామన్ తేల్చిచెప్పారు.

 

ఆర్థికసంఘం సిఫార్సుల మేరకే పన్నుల్లో వాటా కేటాయించడం జరిగిందని, బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం సరి కాదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దేశంలో ఒక రాష్ట్రం తగ్గి రెండు కేంద్రపాలిత ప్రాంతాలు పెరగడం వల్ల ఆర్థిక సంఘమే ఒక శాతం కేటాయింపులు తగ్గించాలని సిఫారేసు చేసిందని ఆమె వివరణ ఇచ్చారు. జీఎస్టీ పరిహారం చెల్లింపులో కూడా తెలంగాణ విషయంలో అన్యాయం జరిగిందనే వాదాన్ని ఆమె ఖండించారు. జీఎస్టీ వసూళ్లు తగ్గడం వల్లనే పరిహారం చెల్లింపులు అన్ని రాఫ్ట్రాలకు జాప్యం అయినట్టు ఆమె తెలిపారు. పరిహారం సెస్ తప్పితే కేటాయింపులకు కేంద్రం వద్ద అదనపు నిధులేవీ లేవని ఆమె వివరణ ఇచ్చారు.

 

తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన రూ.756 కోట్ల ప్రత్యేక గ్రాంటు కూడా అందలేదని ఒక విలేకరి ఆమె దృష్టికి తీసుకురాగా ఆ అంశం తిరిగి ఆర్థిక సంఘం పరిశీలనకే పంపామని ఆమె చెప్పారు. 2010-15 మధ్య కాలంతో పోలిస్తే గడిచిన ఐదేండ్ల కాలంలో తెలంగాణకు కేటాయింపులు దాదాపు 128 శాతం పెరిగి రూ.1.07 లక్షల కోట్లకు చేరుకున్నాయని  కేంద్ర వ్యయశాఖ కార్యదర్శి టి వి సోమనాథన్ అన్నారు. ఆర్థిక సంఘం ఏ పద్దు కింద ఆ ప్రత్యేక కేటాయింపు చేసిందో తెలియచేస్తే దానికి అనుగుణంగా చర్య తీసుకుంటామని ఆమె అన్నారు. స్థానిక కారణాల వల్లే రాష్ట్రాల్లోని రైల్వే పనులలో జాప్యం జరుగుతోంది. నిధుల కేటాయింపు జరగక జాప్యం అనేది సరికాదని అన్నారు. ప్రాజెక్టుల వారీగా వివరాలు అందిస్తే సమస్యలను రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి తెలిపారు. 

 

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు తగ్గుతున్నాయన్న వాదాన్ని కూడా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  తోసిపుచ్చారు.ఆ పథకానికి డిమాండు ఆధారంగా నిధులు కేటాయిస్తామని, డిమాండు అధికంగా ఉంటే నిధులు కూడా పెరుగుతాయని ఆమె వెల్లడించారు. డిమాండు లేకపోవడం వల్లనే నిధుల కేటాయింపులు తగ్గినట్టు ఆమె చెప్పారు. 2000 నోట్ల రద్దు గురించిన ప్రశ్నకు సమాధానం చెబుతూ అది ఇంతవరకు తన దృష్టికి రాలేదని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: