ప్రస్తుతం చైనా దేశాన్ని ప్రాణ భయంతో గజగజా వణికిస్తున్న వ్యాధి కరోనా వైరస్. ఈ ప్రాణాంతకమైన వైరస్ బారినపడి ఇప్పటికే చైనాలో 1500 మంది చనిపోగా 65 వేల మంది ఈ వైరస్ బారినపడి మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. అయితే ఈ వ్యాధితో రోజురోజుకు మరణాల సంఖ్య పెరిగి పోతూనే ఉంది. ఈ వ్యాధికి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో ... చైనాలో మరణ మృదంగం మాత్రం ఆగడం లేదు. ప్రాణాంతకమైన వైరస్ చైనాలోని అన్ని ప్రాంతాల్లో విలయ తాండవం చేస్తూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో పరిస్థితి రోజురోజుకు చేయి దాటి పోయే లా కనిపిస్తుంది. ఇక అటు చైనాకు బాహ్యప్రపంచానికి ఎలాంటి సంబంధం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే పలు కంపెనీలు మూతపడడం... అంతే కాకుండా ఇతర దేశాల నుంచి చైనాకు పలు సర్వీసులను పాక్షికంగా రద్దు చేయడంతో చైనా దేశం మరింత క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయింది.
అయితే భారతదేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే కేరళ రాష్ట్రంలోని ముగ్గురికి కరోనా వైరస్ సోకింది. దీంతో భారతదేశంలోని ప్రజలు కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ గురించి తలుచుకుంటూ భయపడుతున్నారు. అయితే ఈ ప్రాణాంతకమైన కరోనా వైరస్ కారణంగా ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారతదేశంలో కరోనా ఎఫెక్ట్ తో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ తో అన్ని కంపెనీలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే మొబైల్ విడిభాగాల కంపెనీలు కూడా మూతపడ్డాయి.
ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ భారత మొబైల్ వ్యాపారం పై కూడా ప్రభావం చూపుతుంది. స్మార్ట్ ఫోన్లు ఫీచర్ ఫోన్లు విడిభాగాల ధరలు 10 శాతం పెరిగనుండగా... స్మార్ట్ ఫోన్ల ధరలు 6 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పదిహేను నుంచి ఇరవై రోజుల్లోనే మార్కెట్ పై ఈ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. వైరస్ కారణంగా చైనాలో ఫోన్ల విడిభాగాలు తయారు చేసే కంపెనీలు మూతపడడంతో ఫోన్ల ధరలు పెరగనున్నాయి... ప్రీమియర్ స్మార్ట్ఫోన్ మార్కెట్ వాటా దేశంలో తక్కువే కాబట్టి.. వాటిపై ధరల ప్రభావం ఉండకపోవచ్చు.