తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు తమ ప్రాభవం కోల్పోయారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో ఈ పార్టీల తరపున కొద్ది మందైనా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండేవాళ్లు. సంఖ్య తక్కువైనా.. ప్రజాసమస్యలపై నిలదీసేవాళ్లు.. భూపోరాటం వంటి సమస్యలు భూజాలకు ఎత్తుకుని ప్రజల తరపున పోరాడే వాళ్లు.

 

కానీ ఇప్పుడు ఆ సీన్ కనిపించడం లేదు. కమ్యూనిస్టులు పూర్తిగా అసెంబ్లీ నుంచి కనుమరుగైపోయారు. ఊరికే ప్రెస్ మీట్ల ద్వారా అధికారంలో ఉన్నవారిపై విమర్శలు చేసి కాస్త మీడియాలో కనిపించడం తప్ప.. జనం సమస్యలను సీరియస్ గా తీసుకుని ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు. అలా మీడియాకు అలవాటు పడిన నేతల్లో కమ్యూనిస్టు నారాయణ ఒకరు.

 

ఆయన తాజాగా మహబూబ్ నగర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. ఏపీలో జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని విమర్శించారు.

 

అటు, బీజేపీపైనా నారాయణ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగ్రవాద బడ్జెట్ అని అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని, విపక్షాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మరి ఇలాంటి మీడియా టైగర్స్ జనంలోకి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. ఎవరో ఒకరికి తోకలుగా మిగలడం తప్ప స్వయం ప్రకాశం పూర్తిగా కరవైందని చెప్పకతప్పదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: