సెలక్ట్ కమిటి వివాదం కీలక మలుపు తిరగబోతోందా ? అవుననే అంటున్నాయి తెలుగుదేశంపార్టీ వర్గాలు. ఒకటి రెండు రోజుల్లో శాసనమండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు వ్యతిరేకంగా తమ పార్టీ హై కోర్టులో కేసు వేయాలని డిసైడ్ అయినట్లు టిడిపి నేతలు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా మండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ సెలక్ట్ కమిటి పరిశీలనకు రెండు బిల్లులను పంపాలని తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు తప్పు పట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
అసెంబ్లీ ఆమోదించిన రెండు కీలక బిల్లులను మండలిలో మెజారిటి ఉందన్న కారణంతో టిడిపి అడ్డుకున్న విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారిక పార్టీని అడ్డుకునేందుకు చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు ఏకంగా మండలి ఛైర్మన్నే మ్యానేజ్ చేసిన విషయం బయటపడింది. ఆ తర్వాత జరిగిన రబస అందరికీ తెలిసిందే. తాను తీసుకున్న నిర్ణయం తప్పైనా సరే అధికారులు అమలు చేయాల్సిందే అన్న పంతంతో ఛైర్మన్ పదే పదే కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. ఎంత ఒత్తిడి తెచ్చినా తాను నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించేది లేదంటూ తెగేసి చెప్పారు.
దాదాపు మూడు రోజుల పాటు వరుసగా మండలి కేంద్రంగా జరిగిన కంపును చూసిన జగన్మోహన్ రెడ్డి అసలు మండలినే రద్దు చేయించాలని నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో తీర్మానం కూడా చేసేశారు. ఆ తీర్మానం ఇపుడు ఢిల్లీ కోర్టులో ఉందనుకోండి. నిబంధనల ప్రకారం నడుచుకుంటే తాము ప్రభుత్వంపై పై చెయ్యి సాధించలేమని అర్ధం చేసుకున్న టిడిపి నేతలు కోర్టును ఆశ్రయించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. సెలక్ట్ కమిటి సమావేశం పెట్టించటం టిడిపికి ఇపుడు ప్రిస్టేజ్ గా మారిపోయింది.
అందుకనే కోర్టుకు వెళ్ళైనా సరే ఆదేశాలు తెప్పించుకుని సెలక్ట్ కమిటి సమావేశం జరిపించుకోవాలని పట్టుబట్టింది. కోర్టుకు వెళితే కానీ టిడిపి ఎంత అడ్డుగోలుగా వ్యవహరిస్తోందో ప్రపంచానికి తెలీదు. ఛైర్మన్ తమ పార్టీ సభ్యుడే అన్న అడ్వాంటేజ్ ను అడ్డం పెట్టుకుని మండలిని చంద్రబాబు, యనమల ఎంతగా గబ్బు పట్టిస్తున్నారో కోర్టుకు కూడా తెలుస్తుంది. అధికార పార్టీకి కూడా కావాల్సింది కూడా ఇదేనేమో ?