కరోనా వైరస్ దెబ్బకు చైనా కుదేలవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మరణాల సంఖ్య వందలు దాటి వేలకు చేరింది. కరోనా బాధితుల సంఖ్య వేలు దాటి లక్షలకు చేరుతోంది. చైనాతో మిగిలిన దేశాలు సరిహద్దులు మూసేస్తున్నాయి. మరోవైపు చైనా నుంచి వచ్చిన వారితో ఇండియాలోనూ మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. వందల మందిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచి పరీక్షలు జరుపుతున్నారు.
అయితే.. చైనాకు తగిలిన కరోనా వైరస్ దెబ్బ ఇండియాకు లాభాలు తెచ్చిపెడుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది. చైనా నుంచి దిగుమతులు తగ్గడంవల్ల ప్రపంచ దేశాలు కొన్ని వస్తువుల కోసం భారత్వైపు చూస్తున్నాయట. ప్రత్యేకించి పింగాణి, గృహోపకరణాలు, ఫ్యాషన్, జీవనశైలి వస్తువులు, దుస్తులు, చిన్న తరహా ఇంజినీరింగ్ వస్తువులు, ఫర్నిచర్
వంటి వాటి కోసం చాలా దేశాలు చైనా వైపు చూసేవి. చైనా నుంచి దిగుమతి చేసుకునేవి.
అయితే వీటిని ఎగుమతి చేసే సామర్థ్యం ఇండియాకు కూడా ఉంది. అయితే చైనా ఇప్పటి వరకూ గట్టి పోటీదారుగా ఉండటం వల్ల ఇండియా అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు కరోనా దెబ్బతో ఈ రంగాల్లో భారత్ కు అవకాశాలు మెరుగుపడినట్టేనంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ఈ వస్తువుల గురించి విదేశీ కంపెనీలు భారత్ ను అడగటం మొదలు పెట్టాయట.
ఇక కరోనా వైరస్ నుంచి రక్షణ కోసం ముఖానికి ధరించే మాస్క్ల కోసం ఇండియాకు భారీ గా ఆర్డర్లు వచ్చాయట. దేశంలోని మాస్క్లను ఎగుమతి చేసేస్తే మన దేశీయ అవసరాల కోసం అందుబాటులో లేకుండా పోతాయని మొదట ఇండియా భావించింది. అయితే తగినంత ఉత్పత్తి చేస్తామని భరోసా వచ్చాక ఎగుమతి కొనసాగించింది. అయితే ఏదో గాలివాటం అవకాశాల కోసం కాకుండా భారత్ ప్రణాళికతో ముందుకు వెళ్తే గ్లోబల్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.