ఈ కాలంలో కూడా సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన సంఘటన ఏంటంటే ఆడపిల్లలకు సహజసిద్దంగా వచ్చే నెలసరి సమయంలో వారిపట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ మహిళ ప్రిన్సిపాల్ గురించిన సంఘటన విపరితంగా ట్రోల్ అయిన విషయం తెలిసిందే..
అదేమంటే కచ్ జిల్లాలోని భుజ్లో, స్వామి నారాయణ్ మందిర్ సభ్యుల ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సహజానంద గర్ల్స్ ఇనిస్టిట్యూట్.. కాలేజీలో రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. ఎంతలా అంటే నెలసరిలో ఉన్న అమ్మాయిలు కాలేజీ హాస్టల్లోని వంటగదిలోకి వెళ్లకూడదు. తోటి విద్యార్థినులతో కలిసి భోజనం కూడా చేయకూడదు. అలాగే క్లాస్ రూమ్లోనూ మిగతా విద్యార్థినులకు దూరంగా కూర్చోవాలి అనే దారుణమైన వివక్ష కలిగిన ఈ కాలేజీలో కొంతమంది డిగ్రీ అమ్మాయిలు నెలసరి టైంలో వంటగదిలోకి వెళ్లారని ప్రిన్సిపల్కు కంప్లయింట్ అందింది. దీంతో 68 మంది స్టూడెంట్స్ను రెస్ట్ రూంకు తీసుకెళ్లి వారితో బలవంతంగా లో దుస్తులు విప్పించి చెక్ చేయించారు..
ఈ ఘటనపై విద్యార్థినులంతా కాలేజీ క్యాంపస్లో నిరసనకు దిగగా, దెబ్బకు దిగివచ్చిన వర్సిటీ అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రిన్సిపాల్, రెక్టార్, ప్యూన్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అలాగే వారిని సస్పెండ్ కూడా చేస్తూ నిర్ణయం తీసుకున్నామని ఇన్స్టిట్యూట్ ట్రస్టీ ప్రవీన్ పిండోరియా సోమవారం తెలిపారు.
అయితే ఈ ముగ్గురితో పాటు కాలేజీతో సంబంధం లేని అనిత అనే మరో మహిళ వారికి సహకరించిందని, ఆమెపై కూడా కేసు నమోదు చేశామని భుజ్ పోలీసులు తెలిపారు. అంతే కాకుండా అతి నీచమైన ఈ చర్యపై దర్యాప్తుకు మహిళా పోలీసులతో సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు... ఏది ఏమైన సాటి ఆడవారు అనే భావన లేకుండా వీరు ప్రవర్తించిన తీరు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది..