మహారాష్ట్ర సంకీర్ణంలో విభేదాలు ముదురుతున్నాయి. ఇప్పటికే ఎల్గార్ పరిషత్ కేసులో సీఎం ఉద్ధవ్ థాక్రే తీరుపై అసంతృప్తిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ఇప్పుడు ఎన్పీఆర్ అమలు చేయాలన్న నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. ఎన్సీపీ మంత్రులతో పవార్ భేటీ అయిన కాసేపటికే.. ఆ పార్టీ మంత్రి నేతృత్వంలో ఉన్న హోం శాఖ.. ఎల్గార్ పరిషత్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేస్తుందని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

 

మహారాష్ట్రలో బీజేపీతో దశాబ్దాల మైత్రికి స్వస్తి చెప్పి మరీ.. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి సర్కారు ఏర్పాటు చేసింది శివసేన. మంత్రి పదవుల పంపకంలో విభేదాలు తప్పవని అందరూ ఊహించినా.. ఆ విషయంలో మిత్రపక్షాలు ఒక్కతాటిపైకి రావడంతో.. సమస్య రాలేదు. కానీ రీసెంట్ గా ఎల్గార్ పరిషత్ కేసు ఎన్ఐకు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం, దానికి ఉద్ధవ్ మద్దతు తెలపడంపై ఎన్సీపీ అసంతృప్తిగా ఉంది. 

 

అధికారంలోకి రాగానే ఎల్గార్ పరిషత్ కేసులు ఎత్తేస్తామని ఎన్సీపీ హామీ ఇచ్చింది. కానీ శివసేన అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీకి మింగుడు పడలేదు. దీనికి తోడు సీఏఏ, ఎన్పీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీ నిరసనలు తెలుపుతున్న తరుణంలో.. మే నుంచి మహారాష్ట్రలో ఎన్పీఆర్ షురూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పవార్ కు ఆగ్రహం తెప్పించింది. సీఏఏ, ఎన్పీఆర్ అమలు చేయకుండా ఉండేందుకు ఉన్న న్యాయపరమైన అవకాశాలు చూస్తున్నామని ఎన్సీపీ మంత్రి ఒకరు చెప్పినా.. శివసేన మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలని డిసైడంది. ఇప్పటికే ప్రభుత్వంలో ఆ మేరకు ప్రిపరేషన్స్ కూడా జరిగిపోతున్నాయి. 

 

మహారాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న 16 మంది ఎన్సీపీ మంత్రులతో శరద్ పవార్ సమావేశమమయ్యారు. ఎన్పీఆర్ మీదే గంట పాటు చర్చ నడిచినట్టు తెలుస్తోంది. అటు ఎల్గార్ పరిషత్ విషయంలోనూ చర్చ జరిగినట్టు సమాచారం. మీటింగ్ ముగిసిన కాసేపటికే.. ఎల్గార్ పరిషత్ కేసును సిట్ తో దర్యాప్తు చేయిస్తామని ఎన్సీపీ మంత్రి ఆధీనంలో ఉన్న హోం శాఖ ప్రకటించింది. అయితే సిట్ ఎంక్వైరీకి సీఎం పర్మిషన్ ఉందా.. ఆయన అనుమతి లేకుండానే విచారణ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: